పగిలిన తల, రక్తమోడిన నగరం: కోదండరామ్ పిలుపు
మీరు సై అంటే మేమూ సై
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో ఆలేరు శాసనసభ్యుడు బూడిద భిక్షమయ్య గౌడ్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణవాదుల అరెస్టు, పార్లమెంటు సభ్యుల అరెస్టు బాధాకరమన్నారు. తెలంగాణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు.
కిరణ్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్కు మానవత్వం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఆయన ఖూనీ చేశారన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. సహచర ఎంపీల అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పోలీసుల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మంద జగన్నాథం అన్నారు.
ఖబర్దార్.. నాగం
కవాతుకు అనుమతిచ్చి అరెస్టులు చేయడం సరికాదని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. పోలీసులు, ప్రభుత్వం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పంతొమ్మిది రోజులు తెలంగాణవాదులతో పెట్టుకోదల్చుకుంటే ప్రభుత్వం ఇలాగే వ్యవహరించవచ్చునన్నారు. జీవ వైవిధ్య సదస్సుకు అనుమతించిన ప్రభుత్వం కవాతు కోసం ర్యాలీని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.
సంయమనం పాటించండి.. కోదండరామ్
సంయమనం పాటించాలని తెలంగాణవాదులకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. మనం సమ్మక్క-సారక్క వారసులమని, తెలంగాణవాదులు దౌర్జన్యాలకు పాల్పడరని, మీడియా జోలికి వెళ్లవద్దని సూచించారు. తెలంగాణ ప్రజలు సంస్కారవంతులని, కవాతును విజయవంతం చేయాలని, వేదిక పైనుండి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.