గవర్నర్ వద్దన్నా సిఎం పట్టు: లోకాయుక్తగా సుభాషణ్
కానీ, హెచ్చార్సీ చట్టం అందుకు అనుమతించనందున, మరోసారి అవకాశం లభించలేదు. తాజాగా లోకాయుక్త జస్టిస్ ఆనంద రెడ్డి పదవీ విరమణ చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత జస్టిస్ సుభాషణ్ రెడ్డి పేరును ఆ పదవికి సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ నరసింహన్కు బుధవారం ఉదయం ఫైలు పంపించారు. సాయంత్రానికే దానిని గవర్నర్ ఆమోదించారు. వెంటనే లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాజ్భవన్లో శుక్రవారం గవర్నర్ ఆయనతో లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్ రెడ్డిని పట్టుబట్టి నియమింప చేసుకోవడం గమనార్హం. జస్టిస్ సుభాషణ్ రెడ్డిని లోకాయుక్తగా నియమించాలనే ప్రతిపాదనను సిఎం ఆమోదిస్తూ... కొన్నిరోజుల కిందట రాజ్భవన్కు ఫైలు పంపించారు. అయితే, చట్టపరంగా ఈ నియామకం సరికాదంటూ గవర్నర్ దానిని అప్పట్లో తిప్పిపంపారు.
హెచ్చార్సీ చట్టంలోని సెక్షన్ 24(3) ప్రకారం మానవ హక్కుల సంఘం చైర్పర్సన్గా, సభ్యులుగా పనిచేసిన వారు తమ పదవీ కాలం ముగిసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలాంటి ఎంప్లాయిమెంట్ తీసుకోరాదు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి హెచ్చార్సీ చైర్మన్గా పని చేసినందున... ఆయనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే ఏ పోస్టులోనూ నియమించరాదు. అందువల్లే లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి నియామకం కుదరదంటూ ఆ ఫైలును గవర్నర్ తిప్పి పంపారు.
అయినప్పటికీ ముఖ్యమంత్రి వెనక్కి తగ్గలేదు. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును బయటికి తీశారు. ఆ తీర్పు ప్రకారం హెచ్చార్సీ చైర్మన్, సభ్యులుగా పనిచేసిన వారిని ఇతర పదవుల్లో నియమించవచ్చునని, అందువల్ల లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి నియామకాన్ని ఆమోదించాలని ముఖ్యమంత్రి కార్యాలయం మరోసారి ఫైలును గవర్నర్కు పంపింది. అయితే, కేరళలో ఏదో ఒక కేసులో తీర్పు వస్తే దానిని ఆంధ్రప్రదేశ్కు అన్వయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారట. మొత్తానికి ప్రభుత్వం సుభాషణ్ రెడ్డిని పట్టుబట్టి నియమించుకోవడం గమనార్హం.