మోహన్బాబు ఇంటి వద్ద రగడ, తిప్పికొట్టామని విష్ణు
హైదరాబాద్: మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ సినిమాపై వివాదం రగులుతోంది. మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు ఇంటి వద్ద బుధవారం సాయంత్రం దాదాపు 50 మంది బ్రాహ్మణులు రగడకు దిగారు. దేనికైనా రెడీ సినిమాలో అభ్యంతరకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ వాళ్లు ఇంటి వద్దకు వచ్చారు. దీంతో మోహన్ బాబు అనుచరులు బ్రాహ్మణులపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో కొంత మంది బ్రాహ్మణులు గాయపడినట్లు సమాచారం. అయితే, కొంత మంది తమ ఇంటిపై దాడికి దిగారని మంచు విష్ణు అంటున్నారు.
దాదాపు అరగంట పాటు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఇంటి వద్ద ధర్నాకు దిగిన బ్రాహ్మణులపై హీరో మంచు విష్ణు తీవ్రంగా ప్రతిస్పందించారు. వారు తమ ఇంటిపై రాత్రి సమయంలో దాడికి దిగారని ఆయన ఆరోపించారు. ఇంటిపై దాడి చేస్తే ఎలా ఊరుకుంటామని ఆయన అడిగారు. సినిమా బ్రహ్మాండంగా ఆడుతోందని, ఎవరో వెనక ఉండి గొడవ చేయిస్తున్నారని అన్నారు. ఇళ్లపై దాడికి రాకుండా ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడాలని ఆయన అన్నారు.
ఇంట్లో తమ అమ్మ ఒక్కరే ఉన్నారని, ఆ సమయంలో తమ ఇంటిపై దాడికి వచ్చారని ఆయన అన్నారు. తమ ఇంట్లో శుభకార్యానికి బ్రాహ్మణులు కావాల్సి ఉంటుందని, తాము బ్రాహ్మణులను ఎందుకు కించపరుస్తామని ఆయన అన్నారు. తన తండ్రి మోహన్ బాబు 550 సినిమాల్లో నటించారని, అప్పుడు లేని గొడవ ఇప్పుడు ఎందుకని అన్నారు. తమ ఇంటిపైకి వస్తే ఎందుకు ఊరుకోవాలని, తాము గాజులు తొడుక్కుని కూర్చోలేమని అన్నారు. రోషం ఉన్న అచ్చమైన తెలుగువాడిని అని, ఇంటిపైకి వస్తే ఊరుకోబోమని అన్నారు.
అయితే, మంచు విష్ణు ఆరోపణలను బ్రాహ్మణ సంఘం ఖండిస్తోంది. తాము ఇంటి ముందు నుంచి వెళ్తుంటే దాడి చేశారని ఆరోపిస్తోంది. తమ ఇంటిపై జరిగిన దాడిని తాము తిప్పికొట్టామని ఆయన అన్నారు. దేనికైనా రెడీ చిత్రానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆందోళనలకు దిగుతున్నారు.