సిఎం మార్పుండదు: కృష్ణమూర్తి, కిరణ్కు కాల్పై చర్చ
మార్చినా ఏదో జరిగిపోదు
ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ మార్పు ఉండదని పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఒకవేళ మార్చినా ఎలాంటి ఢోకా లేదన్నారు. గతంలో రోశయ్యను మార్చినప్పుడు ఏమైనా రాజకీయ తుఫాన్ వచ్చిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మారిస్తే ప్రభుత్వం పడిపోతుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మార్పుపై నిర్ణయం అధిష్టానానిదే అన్నారు.
ముఖ్యమంత్రి ఒక్కడే తిరిగితే పార్టీ బలపడదన్నారు. అందరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. నిజమైన కార్యకర్తలకు మేలు చేయాలని ఆయన పార్టీ నేతలను కోరారు. వెళ్లి పోయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వవద్దన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు నేతలను అడవి పందులతో పోల్చడం సరికాదన్నారు. ఆయన తన భాష మార్చుకోవాలని సూచించారు.
రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఆయన శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు వస్తున్న సమయంలో కిరణ్ మరోసారి ఢిల్లీ వెళుతుండటం చర్చనీయాంశమైంది.