జెఏసిలో ఎమ్మెల్సీ చిచ్చు: స్వామిగౌడ్పై పోటీకి ప్రదీప్?
ఇప్పటికే తెరాసపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ స్వామి గౌడ్ పైన మరొకరిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20న బిజెపి కోర్ కమిటీ సమావేశమవుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రదీప్ పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. జెఏసిలో కీలకంగా ఉన్న ప్రదీప్కు బిజెపి అవకాశం ఇచ్చిన పక్షంలో జేఎసి ఇరకాటంలో పడుతుందని అంటున్నారు.
ఉత్తర తెలంగాణలో పోస్టు గ్యాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్నాయి. తెరాస తరఫున స్వామి గౌడ్, బిజెపి అభ్యర్థిగా ప్రదీప్ నిలబడితే ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేక జెఏసి ఇబ్బందుల పడక తప్పదంటున్నారు. మరో విషయమేమంటే స్వామి గౌడ్ అక్కడ స్థానికేతరుడు అవుతారు. ప్రదీప్ మాత్రం కరీంనగర్ వాసి. ఆయనకు స్థానికులతో మంచి సంబంధాలు ఉన్నాయట.
దీంతో ఒకవేళ జెఏసి స్వామి గౌడ్కు మద్దతివ్వాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ స్థానిక జెఏసి నేతలు తమ వైపు మొగ్దుతారు, తాము చెప్పినట్లు వింటారా అనే ప్రశ్న జెఏసి అధిష్టానాన్ని పట్టి పీడిస్తోందని అంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా ఉప ఎన్నికలు అనుభవాన్ని నేర్పాయి. పాలమూరు ఎన్నికల సమయంలో జెఏసి పెద్దలు సైలెంట్గా ఉన్నప్పటికీ స్థానిక జెఏసి బిజెపిని బలపర్చాయి.