బిఎస్పీ వాకౌట్: ఓటింగుకు ముందే గట్టెక్కిన యుపిఎ
న్యూఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ)పై లోకసభలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వానికి ఊరట లభించింది. 21 మంది సభ్యులు గల బిఎస్పీ వాకౌట్ చేయడంతో యుపిఎకు ఊరట లభించింది. ఓటింగులో పాల్గొనకూడదని ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీకి 22 మంది సభ్యులున్నారు. దీంతో ఓటింగుకు ముందే యుపిఎ ప్రభుత్వానికి ఊరట లభించింది.

ఎఫ్డిఐలపై ఎటు ఉంటామనే విషయాన్ని బిఎస్పీ నేత మాయావతి చివరకు వరకు తేల్చలేదు. ఎస్పీ, బిఎస్పీలకు చెందిన 43 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఓటింగులో పాల్గొనకూడదని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు.
ఎఫ్డిఐలపై అన్ని పక్షాల వాదనలు విన్నామని, రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదని ఆనంద శర్మ అన్నారు. ఎఫ్డిఐలపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను అడిగామని, 21 రాష్ట్రాలు అభిప్రాయాలు తెలిపాయని, గుజరాత్, పంజాబ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ విషయమూ చెప్పలేదని ఆయన అన్నారు.
కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. బహుళ జాతి సంస్థలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని అనుమతించబోమని, ఆ సంస్ఠల పెట్టుబడులను ఎఫ్ఐపిబీ నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు.
దేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో తీవ్ర కొరత ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల్లో వృధాను బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. విదేశీ సంస్థలు భారత్లో, మన సంస్థలు విదేశాల్లో అమ్ముకోవడానికి వీలు ఉంటుందని అన్నారు. వ్యాపారం చేసే వాటిలో వాల్మార్ట్ ఒక్కటే లేదని ఆయన అన్నారు. ఎఫ్డిఐలను 18 పార్టీల్లో 14 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు.












Click it and Unblock the Notifications