అఖిలేష్, ములాయంకు ఎదురుదెబ్బ: డింపుల్కు ఊరట
అక్రమాస్తుల కేసులో తనపై సిబిఐ విచారణ చేయడాన్ని ములాయం సింగ్ యాదవ్ గతంలో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన కోర్టు ఈ రోజు దానిని కొట్టి వేసింది. ములాయం సింగ్ ఆస్తుల పైన విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాఫ్తు సాగించాలని సిబిఐని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసు నుండి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్కు మినహాయింపును ఇచ్చింది.
ములాయం సింగ్ మరో తనయుడు ప్రతీక్ యాదవ్ పైన కూడా విచారణను కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో గురువారం ఉదయం భేటీ అయ్యారు. కాగా 2007 మార్చి 1వ తేదిన సుప్రీం కోర్టు ములాయం ఆస్తుల కేసుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ములాయం ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.
సుప్రీం కోర్టు తీర్పును ములాయం సింగ్ యాదవ్ స్వాగతించారు. సిబిఐ విచారణతో తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయని తాను భావిస్తున్నానని చెప్పారు.