తెలంగాణ భేటీ: కాంగ్రెసు కార్నర్కు జగన్ పార్టీ ప్లాన్
ఈ స్థితిలో కాంగ్రెసు పార్టీ ముందు తన వైఖరి వెల్లడించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అఖిల పక్ష సమావేశంలో డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెసుకు ఎక్కువ బాధ్యత ఉంటుందని, అందువల్ల ముందు కాంగ్రెసు పార్టీ తన అభిప్రాయం వెల్లడించాలని అడిగే అవకాశం ఉంది. తెలంగాణపై తొలుత కాంగ్రెసు పార్టీ నిర్ణయం చెప్పవలసి ఉందని మైసురా రెడ్డి అన్నారు.
అవగాహన కోసమే తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణపై తమ వైఖరిని పార్టీ ప్లీనరీ సమావేశంలోనే చెప్పామని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీలో ప్రత్యేక రాజకీయాలు, గ్రూపులు లేవని, అందరం కలిసి చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం చెబుతామని ఆయన అన్నారు.
అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై తాము స్పష్టమైన వైఖరే చెబుతామని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి మారినప్పుడల్లా అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమావేశాలు నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణపై గతంలో రెండు సార్లు అఖిలపక్ష సమావేశంలో నిర్వహించారని, కమిషన్ వేశారని, కమిషన్ నివేదిక ఇచ్చిందని, వాటి ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు తన అభిప్రాయం చెప్పకుండా ఇతరుల అభిప్రాయాలు అడగడం సమంజసం కాదని అన్నారు. అఖిలపక్ష సమావేశానికి ఎవరిని పంపించాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశంలో అద్భుతాలు జరిగే అవకాశాలు ఏమీ లేవని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని అడిగే హక్కు తమకు లేకపోయినప్పటికీ కాంగ్రెసు వైఖరిని అడిగే హక్కు ఉందని ఆయన అన్నారు.