తెలంగాణ: కేంద్రం మదిలో ఆ రెండు!? ప్రకటనపై ఉత్కంఠ
కేంద్రం, అధిష్టానం ప్రధానంగా రెండు ఆప్షన్స్ను పరిశీలిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను సీమాంధ్ర, తెలంగాణలుగా రెండు రాష్ట్రాలుగా విభజించి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే ఆప్షన్ మొదటిది అని అంటున్నారు. ఈ ప్రకటన వెలువడితే సీమాంధ్ర నుండి పెద్దగా నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు లేవు. కానీ, తెలంగాణలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతుంది. దీనిపై కేంద్రం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు కొందరు హైదరాబాదుకు చెందిన నేతలు హైదరాబాదును యూటిగా చేస్తే ఊరుకునేది లేదని అవసరమైతే ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని లేదా తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్రం ఆలోచిస్తున్నప్పటికీ ఇది అంత సులువు కాదని అంటున్నారు. ఇక రెండోది ఆప్షన్... రాయల తెలంగాణ, రాయల ఆంధ్ర రాష్ట్రాలుగా చేయడంపై చర్చిస్తోందని తెలుస్తోంది. దీనిపై కూడా ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తున్నారట.
రాయల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం, కర్నూలు జిల్లాలను, రాయల ఆంధ్రా రాష్ట్రంలో ఆంధ్రా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన కడప, చిత్తూరులను కలిపే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందని అంటున్నారు. అయితే సీమ జిల్లాలను కలిపితే తెలంగాణవాదులు ఒప్పుకుంటారా? హైదరాబాదును రాయల తెలంగాణలో కలిపితే రాజధాని కోసమే ఉద్యమిస్తున్న కోస్తాంధ్ర ప్రజలు ఎలా స్పందిస్తారనే విషయమై చర్చిస్తున్నట్లుగా సమాచారం.
రాష్ట్రంపై ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని, ఇక చర్చించాల్సిందేమీ లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొందరు అసలు ప్రకటన వెలువడుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ బుధవారం మాట్లాడుతూ డెడ్ లైన్ నెల రోజులు అంటే నెల రోజులనే కాదని పది రోజులు అటు ఇటు కావొచ్చునని అన్నారు. ఆజాద్ చెప్పినట్లుగా పదిరోజులు అటు ఇటు అని చెప్పినప్పటికీ కేంద్రం నుండి ప్రకటన వెలువడినా అది తెలంగాణ సమస్యకు పూర్తిస్థాయిలో ఫుల్స్టాప్ పెట్టే విధంగా ఉండక పోవచ్చుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆజాద్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పట్లో తెలంగాణ అంశం తేల్చమని చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు.