బాబుది దొంగ సంతకాల చరిత్ర: మేకపాటి, షర్మిల టార్గెట్
చంద్రబాబుకు మద్దతుగా సంతకాల సేకరణపై ఓ తెలుగు టీవీ చానెల్ కట్టుకథలు చెబుతోందని ఆయన విమర్శించారు. దొంగ సంతకాలు చేసే అలవాటు ఆ చానెల్కే ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని, చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మేకపాటి అన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ఆయన అడిగారు.
చంద్రబాబుకు రాజకీయ పిచ్చి పట్టిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచందర్ రావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎల్లవేళలా వైయస్ జగన్ పేరునే కలవరిస్తున్నారని, జగన్ అంటే చంద్రబాబుకు భయమని ఆయన అన్నారు. జగన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారంటే చంద్రబాబుకు జగన్ అంటే ఎంత భయమో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. చంద్రబాబు పనికి రాని రాజకీయనేత అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఓ చానెల్ జగన్ కోసం సేకరించిన సంతకాలపై కట్టుకథలు ప్రసారం చేస్తోందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ సోదరి షర్మిల, అనిల్ దంపతుల సంపాదనపై బిజెపి నాయకుడు ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకర రావు, మారెప్ప తప్పు పట్టారు. ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ గొంతును బిజెపి కార్యాలయంలో వినిపిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. షర్మిల, అనిల్ దంపతుల సంపాదనపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. షర్మిల పాదయాత్రను అడ్డుకోవడానికే ప్రభాకర్ ఆ విమర్శలు చేస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆస్తులు ప్రభాకర్కు కనిపించడం లేదా అని వారు అడిగారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టినా పడిపోదని తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి అన్నారు. పార్లమెంటులో ఎఫ్డిఐల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కొందరు ఆదుకున్నారని, ఇక్కడ కూడా కిరణ్ ప్రభుత్వాన్ని కొంత మంది ఆదుకునేవారుంటారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంపై ఆలోచన చేస్తామని, అవసరం అనుకుంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు లేడని ఆయన అన్నారు.