స్వామి గౌడ్పై ఛార్జీషీట్: ఎన్నికల్లో పోటీకి ముందు..
దీంతో బేగంబజార్ పోలీసులు ఈ రోజు స్వామి గౌడ్ కేసు విషయంలో పురోభివృద్ధిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి తాము ఛార్జీషీటు దాఖలు చేసినట్లు చెప్పారు. ఆయనపై నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో విచారణ సాగుతోందని తెలిపారు. స్వామి గౌడ్ పైన 404, 406, 420, 120(బి), 156(3) సెక్షన్ల క్రింద అభియోగాలు మోపినట్లు వెల్లడించారు. విచారణ కొనసాగుతోందన్నారు.
కాగా స్వామి గౌడ్ పైన హౌసింగ్ సొసైటీ విషయంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. టిఎన్జివో హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపుల్లో స్వామి గౌడ్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సొసైటీలోని అక్రమాలను సహకార శాఖ అధికారి కిరణ్మయి ధ్రువీకరించారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఉద్యోగులకు కేటాయించిన ఫ్లాట్లలో అవకతవకలు జరగాయంటూ, సొసైటీని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీంతో దీనిపై పూర్తి స్థాయి విచారణకు కోర్టు ఆదేశించింది. ప్లాట్ల కేటాయింపులో భారీ అవకతవకలు జరిగాయని విచారాధికారి కిరణ్మయి నిర్ధారించారు. 1991లో గచ్చిబౌలి, గోపన్నపల్లెలో టీన్జీవోలకు 160 ఎకరాలు కేటాయింపు జరిగింది. సభ్యత్వ నమోదు పుస్తకాన్ని నిర్వహించకుండా ఇష్టానుసారంగా ప్లాట్లు కేటాయించినట్లు నివేదికలో కిరణ్మయి తెలిపారు. 240 ప్లాట్లను బినామీ పేర్లతో కేటాయించారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడుతున్న సమయంలోనే..
స్వామి గౌడ్ కరీంనగర్ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఎన్నికలకు ముందు స్వామి గౌడ్ పైన ఛార్జీషీటు దాఖలు చేసినట్లు పోలీసుల చెప్పారు. అయితే ఛార్జీషీటు దాఖలు చేసినా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని, స్వామి గౌడ్ను కోర్టు నిందితుడిగా తేల్చేతే అప్పుడు అనర్హుడు అవుతారని చెబుతున్నారు.
ప్రభుత్వం కంటే పోలీసులే
ప్రభుత్వం కంటే పోలీసులే ఎక్కువ చొరవ చూపిస్తున్నారని స్వామి గౌడ్ ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టేందుకే ఇలా చేస్తున్నారన్నారు. కోర్టులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకముందన్నారు.