అన్నాహజారే ర్యాలీకి స్పందన కరువు: సభలో తెలంగాణ
మార్పుతోనే అవినీతి అంతమవుతుందన్నారు నచ్చిన అభ్యర్థికి ఓటేసే హక్కు ఉన్నట్లే నచ్చని అభ్యర్తిని తిరస్కరించే హక్కు కావాలన్నారు. జన లోక్పాల్తో అవినీతి యాభై శాతమే తగ్గుతుందన్నారు. అందరం కలిసి అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దామని యువతకు అన్నా పిలుపునిచ్చారు. ప్రభుత్వం దిమ్మ తిరిగేందుకు కొంతమంది జాగృతం అయినా చాలని ఆయన అభిప్రాయపడ్డారు. లోకపాల్ బిల్లు పైన వారే కేంద్రాన్ని నిలదీస్తారన్నారు.
అవినీతి అంతం కోసం జన్లోక్పాల్ బిల్లును తీసుకురావాలని కోరుతున్నానని, ఈ బిల్లు వస్తే తమ 15 మంది మంత్రులు జైలుకు వెళతారని, అందుకే బిల్లు వద్దంటూ కేంద్రం చెబుతోందని, బిల్లు ముసాయిదా రూపకల్పనలో ప్రజలను భాగస్వాములను చేయాలని కోరానని, కపిల్ సిబల్ వంటి మంత్రులు ప్రజా భాగస్వామ్యమెందుకని ప్రశ్నించారని కానీ, 1950 జనవరి 26న గణతంత్రాన్ని ప్రకటించుకున్నాక ప్రజలే దేశ యజమానులైన సంగతి ఆ మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు.
తమకు సేవ చేయండంటూ ఎంపిలు, ఎమ్మెల్యేలను ప్రజలు చట్టసభలకు పంపితే యజమానులే సేవకులయ్యారని, సేవకులే యజమానులయ్యారని విమర్శించారు. రాంలీలా మైదాన్లో 12 రోజుల పాటు దీక్ష చేపట్టినా స్పందించని ప్రధానమంత్రి 13వ రోజు జన్ లోక్పాల్ బిల్లును తెస్తామంటూ తనకు లేఖ రాసి మాట తప్పారన్నారు. తనకు విదేశీ విరాళాలు రావడం లేదని, సమావేశాల నిర్వహణకు జోలె పడుతున్నానని చెప్పారు.
కాగా, గతంలో అన్నా హజారే పిలుపునకు యువత లక్షలాదిగా కోట్లాదిగా కదిలిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దండు విడిశారు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆయనకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సిటిజన్లతో పాటు నెటిజన్లూ కోట్లాదిగా ట్వీట్లు పెట్టారు. దేశంలో అవినీతిపై సామాజిక వెబ్సైట్లలో తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఆ ఆవేశాన్ని ప్రతిబింబించే ప్రతీకగా ఆయన్ను భావించారు. కానీ, ఇప్పుడు పరిస్థితిలు మారిపోయాయి.
ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటైన అన్నా సభకు వచ్చిన స్పందన అంతంత మాత్రమే. ఆయన మాటలు వినేవాళ్లు పట్టుమని వెయ్యిమంది కూడా లేకుండా పోయారు. దేశప్రజల్లో మార్పు కోసం చేపట్టిన జనతంత్ర ర్యాలీలో భాగంగా ఆయన హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీ ఆవరణలో ప్రసంగిస్తే చాలా కుర్చీలు ఖాళీగా మిగిలాయి. మరోవైపై అన్నా సభలో తెలంగాణ నినాదాలు వినిపించాయి. కొందరు యువకులు జై తెలంగాణ అంటూ తమ సమస్య వినాలని కోరారు. అన్నా వారిని సముదాయించే ప్రయత్నాలు చేసినా వినకపోవడంతో పోలీసులు వారిని బయటకు పంపించారు.