ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెసు నుంచి పాత ముఖాలే
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకరరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, భారతీ నాయక్, లక్ష్మీ దుర్గేశ్, పుల్లా పద్మావతి పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ చేస్తున్నవారిలో సుధాకరరెడ్డి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభి చారని, చీఫ్ విప్గా ఉన్న భారతీ నాయక్ తన గిరిజన సామాజిక వర్గాన్ని ముందుకు తెచ్చి మరో అవకాశం కోరుతు న్నారని వార్తలు వస్తున్నాయి. బడా నేతలు కూడా ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్కు సంబంధించినంత వరకు టికెట్లు ఆశిస్తున్న వారిలో శాసనసభ మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వంటి నేతలు కూడా ఉన్నారు. దీంతో దిగువ స్థాయి నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. సురేష్ రెడ్డి గత శాసనసభ ఎన్నికలలో ఓడిపోయారు. అలాగే మాజీ మంత్రి షబ్బీర్ అలీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది.
తెలుగుదేశం పార్టీలో కూడా పోటీ తీవ్రంగానే ఉంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి దించే ఆలోచనలో ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.
పుల్లా పద్మావతికి మరో అవకాశం దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమె వైయస్ జగన్ వైపు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చారు. దాంతో ఆమె పట్ల నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది.