నో టైమ్: సుప్రీంలో సంజయ్ దత్కు ఎదురుదెబ్బ
సంజయ్ దత్తో సినిమా తీస్తున్న ఇద్దరు నిర్మాతలు తమ సినిమాలు పూర్తి చేసుకోవడానికి వీలుగా లొంగిపోయేందుకు సంజయ్ దత్కు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ దత్ ఈ నెల 16వ తేదీన లొంగిపోవాల్సి ఉంది. సంజయ్ దత్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు ఎదురు దెబ్బ తగిలింది. 1993 వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు మే 10వ తేదీన సంజయ్ దత్ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చింది. ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఇతర ఆరుగురు దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ముంబై పేలుళ్ల కేసులో దోషులు యూసుఫ్ మోసిన్ నుల్వాలా, ఖలీల్ అహ్మద్ సయీద్ అలీ నజీర్, మొహమ్మద్ దావూద్ యూసుఫ్ ఖాన్, షేక్ ఆసీఫ్ యూసుఫ్, ముజామిల్ ఉమర్ కాద్రీ, మొహ్మద్ అహ్మద్ షేక్ రివ్యూ పిటిషన్లను దాఖలు చేసుకున్నారు.
నిజానికి సంజయ్ దత్ ఏప్రిల్ 17వ తేదీలోగా లొంగిపోవాల్సి ఉంది. కానీ, కోర్టు మే 16వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అతను మరో 42 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 1993 ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ను దోషిగా నిర్ధారిస్తూ మార్చి 21వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు సంజయ్ దత్కు టాడా కోర్టు వేసిన ఆరేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు తగ్గించింది.
అక్రమంగా 9 ఎంఎం పిస్టల్ను, ఎకె - 57 రైఫిల్ను అక్రమంగా కలిగి ఉన్నందుకు సంజయ్ దత్ను టాడా కోర్టు దోషిగా నిర్ధారించింది. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మందికిపైగా గాయపడ్డారు.