జగన్కి జైకొడితే ఏంటి?: డబ్బుచుట్టూ తెరాస పాలిటిక్స్
హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు అంతర్గత విభేదాలు, జంప్ల సమస్యలను ఎదుర్కొంటుంది. అధికార కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు ఇటీవల కొత్త సమస్యలు వస్తున్నాయి. ఈ పార్టీలోను అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెసును కళంకిత మంత్రుల అంశం, తెరాసను రఘునందన రావు అంశం గత మూడు నాలుగు రోజులుగా చిక్కుల్లో పడేసింది.
మేం మాత్రమేనా..?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అభియోగాలు మోపబడ్డ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ముగ్గురు మంత్రులు కూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో పాటు ధర్మాన, సబితలను ఇంటికి పంపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రులు ఆగ్రహంతో ఉన్నారట.
...జగన్తో వెళ్తే తప్పేంటి?
వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆకాశానికెత్తేసిన అధిష్టానం ఆయన చర్యలకు అడ్డుపడకుండా ఇప్పుడు తమను బలి చేయడమేమిటని వారు ఆవేదన చెందుతున్నారట. తమను కళంకిత మంత్రులు అనడాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్న వారు... అదే నెపంతో తమపై వేటు వేసిన పక్షంలో ఊరుకునే అవకాశం లేదంటున్నారు. వైయస్ హయాంలో జరిగిన తప్పులకు తాము మాత్రమే బలి కావాల్సి వస్తే... మొత్తం కాంగ్రెసు కావాల్సిందేనని వారు ఆవేదన చెందుతున్నారట.
తాము మాత్రమే బలయ్యేది లేదని కొందరు కుండబద్దలు కొడుతున్నారట. కాంగ్రెసు కూడా తప్పు చేసినట్లేనని చెబుతున్నారట. కాంగ్రెసు తమనే బలి చేయాలని భావిస్తే... అందరిలాగే తాము వైయస్ జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తే తప్పేంటనే ప్రశ్న కూడా పలువురిలో ఉదయిస్తోందని అంటున్నారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు రేపు ముఖ్యమంత్రితో సమావేశమనయ్యాక వేటు పడాల్సి వస్తే... తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ధిక్కార స్వరం అధిష్టానానికి తప్పదంటున్నారు. మరోవైపు ధర్మానకు జిల్లా మంత్రులు కొండ్రు మురళి, కిల్లి కృపారాణి మద్దతుగా నిలుస్తున్నారట. ధర్మానపై వేటు వేస్తే రాజీనామాలకు జిల్లాలో ఆయన వర్గం సిద్ధంగా ఉందంటున్నారు.
కెసిఆర్కు రఘునందన చిక్కులు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రఘునందన రావు కారణంగా పెద్ద చిక్కులు వచ్చాయని అంటున్నారు. ప్రస్తుతం తెరాస రాజకీయాలు డబ్బుల చుట్టు తిరుగుతున్నాయి. టిఆర్ఎస్ ముఖ్య నేతలు తెలంగాణవాదం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. వాటికి రఘునందన రావు ఆరోపణలు మరింత బలాన్నిచ్చాయని అంటున్నారు.
తెరాస స్థాపించినప్పటి నుండి పలువురు నేతలు బయటకు వచ్చి కెసిఆర్ను టార్గెట్ చేశారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. రఘునందన రావు కూడా అలాగే చేస్తున్నారు. అయితే, ఇతని ఆరోపణలు మరింత ఘాటుగా ఉండటం గమనార్హం. అతను ప్రధానంగా హరీష్ రావును టార్గెట్ చేసుకోవడం గమార్హం. ముఖ్య నేతల బ్లాక్ మెయిలింగ్కు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పడం, దమ్ముంటే ఆధారాలు చూపించాలని తెరాస నేతలు సవాల్ విసరడం జరుగుతోంది. హరీష్ రావు పైన రఘు రూ.80 లక్షలు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రఘు వసూళ్ల ఆరోపణలపై హరీష్, కెటిఆర్, కవితలు స్పందించాల్సి వచ్చింది. మొత్తానికి ఎన్నికల ముందు తెరాస రాజకీయం డబ్పుల చుట్టు తిరగటం కెసిఆర్కు ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు.