రాజీనామాల పరంపర: కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాల పరంపర కొనసాగుతోంది. శనివారం మరింత మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. శనివారం ఉదయం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బరామరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే అరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శివారి సోమ రాజీనామా చేశారు. తాజాగా శాసనసభ్యులు అన్నా రాంబాబు, శేషు, చింతమనేని ప్రభాకర్ రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం శాసనసభ్యుడు బొత్స అప్పలనర్సయ్య కూడా రాజీనామా చేశారు.
కెసిఆర్ వ్యాఖ్యలను నిరసనగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు విధులను బహిష్కరించారు. విజయవాడ సబ్కక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నాకు దిగారు. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా, రాహుల్ బొమ్మలతో వీధినాటకాలు ఆటను ప్రదర్శించారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించారు. కార్పోరేషన్ ఆఫీసు ఎదుట మానహారం నిర్వహించారు. అటు చల్లపల్లిలోనూ విద్యార్థులు ర్యాలీ, మానవహారం చేపట్టారు. బందరు కోనేరు సెంటర్లో జేఏసీ భారీ ప్రదర్శనకు దిగారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తిరుపతి నగరంలో ఆందోళనలు కొనసాగున్నాయి. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రైవేటు ట్యాక్సీ యూనియన్లు జీపు ర్యాలీ నిర్వహించారు. తిరుమల కొండపై జీపులను వెళ్లేందుకు నిరాకరించారు. అనంతపురంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు శవయాత్రను నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. పళ్లంరాజు పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా బాపట్లలో సమైక్యవాదులు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
హైదరాబాద్నగరంలోని అబిడ్స్ ఇన్సురెన్స్ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనకు దిగగా, దానికి ప్రతిగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పోటా పోటీ ఆందోళనలతో ఇరువురి ఘర్షణ వాతావరణ నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన రాపిడ్ యాక్షన్ పోలీసులు పరిస్థితిని అదుపుచేయడానికి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications