హైదరాబాద్ కెసిఆర్ జాగీర్ కాదు: శైలజానాథ్
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. సీమాంధ్ర ఉద్యోగులపై కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం ఉదయం సచివాలయం ఉద్యోగులు ధర్నాకు దిగారు. సచివాలయం మెయిన్గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన మంత్రి శైలజానాథ్ వాహనాన్ని ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో శైలజానాథ్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ ఉద్యోగులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఎవరి దయాదాక్షిణ్యాల మీద తాము ఇక్కడ ఉండడం లేదని, దేశంలో ఎవరు ఎక్కడైనా ఉండవచ్చునని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే తాము ఇక్కడ ఉంటున్నామని, ఈ విషయం విజయనగరం జిల్లాకు చెందిన కెసిఆర్కు కూడా తెలుసునని అన్నారు. కెసిఆర్ అసలు రంగు బయటపడిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేస్తున్నారో చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు చంద్రబాబుతో లేఖ ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప మరో మార్గం లేదని అన్నారు.
తెలంగాణకు అనుకూలంగా వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేస్తున్నారని శైలజానాథ్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము రాజీనామాలు చేస్తున్ామని ఆయన చెప్పారు. హరికృష్ణ కూడా రాష్ట్ర విభజనను స్వాగతించారని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి స్థితిలో సీమాంధ్ర టిడిపి ప్రజాప్రతినిధులు ఎందుకు రాజీనామా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హైదరాబాద్ అందరి సొత్తు అని ఆయన అన్నారు. విభజనపై యుపిఎ ప్రభుత్వం దిగి వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం అన్ని రకాల ఆందోళనలను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. చంద్రబాబు విభజనను బలపరుస్తుంటే తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. హైదరాబాదు ఆంధ్రుల చెమట, రక్తంతో నిర్మితమైందని అన్నారు.
హైదరాబాద్ ఎవరి జాగీర్ కాదని, సీమాంధ్ర ఉద్యోగులకు అండగా నిలుస్తామని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ అందరిదీ అనే విషయాన్ని గట్టిగా చెబుతామని ఆయన అన్నారు.