సోనియాతో భేటీ: ప్రక్రియ స్తంభనపై పళ్లంరాజు ఆశ
వారు గంటకుపైగా సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం పళ్లంరాజు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కమిటీకి సమస్యలు వినిపించాలని సోనియా చెప్పారని పళ్లంరాజు అన్నప్పుడు ప్రక్రియ ఆగుతుందా అని మీడియా ప్రతినిధులు అడిగారు. ఆగుతుందని పళ్లంరాజు సమాధానమిచ్చారు.
తమ ప్రాంతంలోని ఆందోళనను సోనియాకు వివరించామని ఆయన అన్నారు. ఒక ప్రాంతానికి పరిష్కారం చూపించారని, తమకు అన్యాయం జరుగుతుందనే భావన సీమాంధ్రలో నెలకొని ఉందని చెప్పామని ఆయన అన్నారు. కమిటీని ప్రకటిస్తాం, ఆ కమిటీ ముందు అన్ని విషయాలూ చెప్పండని సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పాలని, వాటిని పరిశీలిస్తామని సోనియా చెప్పినట్లు ఆయన అన్నారు.
న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు ఆయన విజ్ఝప్తి చేశారు. సంయమనం పాటించాలని సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. అన్ని వర్గాలకూ సమన్యాయం జరగుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన ఏకపక్షం అవుతుందనే బాధ అక్కర్లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని సోనియాకు చెప్పామని, అపోహలన్నింటినీ కమిటీకి చెప్పాలని సూచించారని ఆయన అన్నారు. హైదరాబాదును శాశ్వత రాజధానిగా ఉంచాలని కమిటీకి చెప్తామని, తమ కోరిక నెరవేరుతుందనే ఆశతో ఉన్నామని ఆయన అన్నారు.