మీవి అబద్దాలేనా?: భారతి, విజయమ్మకు శోభ ప్రశ్నలు
పార్టీ అధ్యక్షుడు, తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను ఫోన్ చేసి చెబుతానని విజయమ్మ చెప్పడం, అసలు జగన్ ల్యాండ్ ఫోన్, సెల్ ఫోన్ ఏదీ 14 నెలలుగా ముట్టుకోలేదని భారతి బహిరంగ లేఖలో పేర్కొనడం చూస్తుంటే అత్తా, కోడళ్లు ఇద్దరు కలిసి అబద్దాలు ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
మూడేళ్లలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనుమరుగవుతుందని మండిపడ్డారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో దొంగల్లా చొరబడ్డారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శించడంపై ఆమె మండిపడ్డారు. తెలంగాణకు తాము అనుకూలంగా ఉన్నామని వైయస్ జగన్, విజయమ్మ పలుమార్లు చెప్పారన్నారు.
కొండా సురేఖ తన కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ఆమె త్యాగాలను చూసి తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తున్నానని, కేంద్రం తెలంగాణ ఇస్తే కాదనమని ఇడుపులపాయ ప్లీనరీలో జగన్ ప్రకటించలేదా అని శోభా ప్రశ్నించారు.
అలాగే మహబూబ్ నగర్లో విజయమ్మ మాట్లాడుతూ.. 1999లో తెలంగాణ సెంటిమెంట్ గుర్తించే చిన్నా రెడ్డి నాయకత్వంలో 41 మంది ఎమ్మెల్యేల బృందాన్ని నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పంపించారని చెప్పలేదా అన్నారు. జగన్ పార్టీ పెట్టాక కూడా తెలంగాణకు అభ్యంతరం లేదని లేఖ రాయలేదా చెప్పాలన్నారు. ఊసరవెల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు.