దేవినేని ఉమాకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి.. జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. ఆన్లైన్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి జూమ్ యాప్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు దేవినేని ఉమాను రాజమండ్రి జైలుకు తరలించారు. దేవినేని ఉమాతో పాటు డ్రైవర్ ప్రసాద్, తెలుగు యువత నేత లీలాప్రసాద్కి కూడా కోర్టు రిమాండ్ విధించింది.
కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగులో ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోంది. అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారని అసత్యపు ప్రచారం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి ఉమాని ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
Recommended Video
ఉమా తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు చేస్తూ కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఇరువర్గాలు స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో అదే అటవీ ప్రాంతంలో ఉమా అక్రమ మైనింగ్ చేశాడని వైసీపీ ఆరోపించింది. జి కొండూరులో అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున గ్రామానికి తరలిరాగా పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేవినేని ఉమాను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. దీంతో జైలుకు తరలించారు.