శ్రీవారి భక్తులకు తీపి కబురు: సిఫార్సు లేకుండానే 10లడ్డూలు
తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులకు ఇది ఖచ్చితంగా తీపి కబురే. ఎందుకంటే.. ఇప్పటివరకూ రెండు లడ్డూలు మాత్రమే ఇస్తుండగా ఇకపై అదనంగా 10 లడ్డూల వరకు ఇవ్వనున్నారు.
భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేయాలన్న లక్ష్యంతో ఇటీవల లడ్డూల తయారీని పెంచడంతో దాదాపు 7లక్షల లడ్డూలు నిల్వ ఏర్పడ్డాయి. ఈ కారణంగా మంగళవారం నుంచి ఎటువంటి సిఫారసు లేకుండా భక్తుడు కోరితే 6 లడ్డూల వరకు ఇస్తున్నారు.
కోరితే 10లడ్డూలు
అయితే బుధవారం కూడా కోటా మిగిలే పరిస్థితి రావడంతో జేఈవో శ్రీనివాసరాజు సీనియర్ అధికారులతో చర్చించి భక్తుడు కోరితే 10 లడ్డూల వరకు ఇవ్వాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి రూ.50 చొప్పున భక్తులకు 10 లడ్డూల వరకు జారీచేశారు.
ఇకపై కూడా..
అంతేగాక, ఇకపై భక్తులకు ఎటువంటి సిఫారసు లేకుండా ఒక్కొక్కరికి 10 లడ్డూలు అందించనున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 18న దివ్యప్రబంధ అధ్యయనోత్సవాలు గురువారం ముగియనున్నాయి.
తిరుమలలో వేడుకలు
మరోవైపు కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో జనవరి 16వ తేదీన పార్వేట ఉత్సవం కన్నుల పండువగా జరుగనుంది. అదేరోజు సాయంత్రం గోదా పరిణయోత్సవం నిర్వహిస్తారు.
ఇటీవల పెరిగిన లడ్డూల ధరలు
కాగా, ఇటీవల టీటీడీ.. లడ్డూ ధర రూ.50, కళ్యాణోత్సవం లడ్డూ ధర రూ.200, వడ ధర రూ.100గా నిర్ణయించింది. అయితే, ఈ ధరలు సిఫార్సు లేఖలపై జారీ చేసే ప్రసాదాలకు మాత్రమే వర్తిస్తాయి.