ప్రాణం తీసిన పేదరికం: ముగ్గురు కుమారులతో ఉప్పుటేరులో దూకి వివాహిత ఆత్మహత్య
తూర్పుగోదావరి: జిల్లాలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద అమరవిల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన ముగ్గురు కుమారులతో కలిసి ఓ వివాహిత ఉప్పాడ ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇద్దరు కుమారులు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఆ తల్లి ఈ తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారికి వైద్యం అందించలేని పేదరికం కూడా ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మృతి చెందిన వారిలో తల్లి భూలక్ష్మి(45), కుమారులు ప్రేమ్కుమార్(22), అనిల్కుమార్(21), ప్రభుదాస్(20) ఉన్నారు. మొదట పురుగుల మందు తాగి కాళ్లకు తాళ్లు, రాళ్లు కట్టుకుని ఉప్పుటేరులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాలను బయటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
విశాఖపట్నం: గురువారం విశాఖ జిల్లా కంచరపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.