వైసిపి నేత హత్య: ప్రతీకారమే, నిందితుల పట్టివేత
అనంతపురం: అనంతపురం జిల్లాలోని రాప్లాడులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ప్రసాద్రెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులుతో సహా 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారంనాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
రాప్తాడు మండలం వైసీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద రెడ్డి (48)ని బుధవారంనాడు ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపిన విషయం తెలిసిందే. వివరాలు ఇలా ఉన్నాయి - రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన ప్రసాద్రెడ్డి రాప్తాడు సమీపంలో వెంచర్ వేశారు. దీనికి సంబంధించిన అనుమతులు, ఇతర పనుల నిమిత్తం పది రోజులుగా తహసిల్దారు కార్యాలయానికి వస్తున్నారు. ఆయన ప్రత్యర్థి, ఆ మండల టీడీపీ ఉపాధ్యక్షుడు ఉప్పర శ్రీనివాసులు కూడా అనుచరులతో తరచూ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేవారు. ఇరువర్గాల వారు ఒకరికొకరు తారసపడేవారు.
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ప్రసాద్రెడ్డి తన అనుచరుడు శివతో కలిసి స్కార్పియో వాహనంలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా తహసీల్దార్ను కలిశారు. ఆ తర్వాత ఆ పక్క గదిలో ఉన్న ఆర్ఐ వద్ద కూర్చున్నారు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా 11.50 గంటల సమయంలో ప్రత్యర్థులు వేటకొడవళ్ల్లు చేతపట్టుకుని నేరుగా అక్కడికి వచ్చారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శివను పక్కకులాగి కంప్యూటర్ రూమ్లో బంధించారు.
కుర్చీలో కుర్చున్న ప్రసాద్ రెడ్డిపై ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా నరికివేశారు. దీంతో ప్రసాదరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ హఠాత్పరిణామంతో తహసీల్దార్తో సహా అధికారులు, సిబ్బంది బయటికి పరుగులు తీశారు.
ప్రత్యర్థులు బంధించిన ప్రసాద్రెడ్డి అనుచరుడు శివ గట్టిగా కేకలు వేస్తూ ప్రసాద్రెడ్డిని చంపేస్తున్నారంటూ ఎస్ఐకి ఫోన్ చేసి సమాచారం అందించాడు. కార్యాలయం సమీపంలోనే ఉన్న ఎస్ఐ తన సిబ్బందితోపాటు హుటాహుటిన అక్కడికి తరలి వచ్చారు. అప్పటికే ప్రత్యర్థులు తమ పనిముగించుకుని, తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపు ప్రహరీ గోడ దాటుకుని పరుగులు తీస్తున్నారు. పోలీసులు ద్విచక్ర వాహనాల్లో వారిని వెంటాడారు. హత్యలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాప్తాడు తహసీల్దార్ హరికుమార్, ఆర్ఐ దివాకర్ సహా మొత్తం 13మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రసన్నాయపల్లికి చెందిన ఉప్పర శ్రీనివాసులు, ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, హరి, అనిల్, రంగ, కమల్ బాబు, గోపాల్రెడ్డి, అనిల్, సాంబశివారెడ్డి, హోటల్ నాగప్ప, రవిలను నిందితులుగా పేర్కొన్నారు.
హతుడు ప్రసాద్రెడ్డిది రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి. ఓ మహిళ విషయంలో 2003లో అదే గ్రామానికి చెందిన ఉప్పర చలపతి, ఆయన అనుచరులు రామచంద్ర, వెంకట నారాయణలను ప్రసాదరెడ్డి వర్గీయులు గ్రామ సమీపంలోనే దారుణంగా హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఈ హత్య కేసులో ప్రసాద్రెడ్డి మొదటి ముద్దాయి. ఈ కేసును కోర్టులో కొట్టి వేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చలపతి భార్య టీడీపీ మద్దతుతో, ప్రసాద్రెడ్డి భార్య వైసీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రసాద రెడ్డి భార్య విజయం సాధించారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రెండు వర్గాల మధ్య కక్షలు పెరిగాయి. గ్రామంలో ప్రసాద రెడ్డి వర్గీయులదేపై చేయి అయింది. ఈ నేపథ్యంలో ప్రసాద రెడ్డి తాజా హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
రాప్తాడులో జరిగిన ప్రసాద్రెడ్డి హత్య రాజకీయ హత్య కాదని ఫ్యాక్షన్ హత్య అని అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబు చెప్పారు. ఈ కేసులో నిందితులైన శ్రీనివాసులు, అశోక్, అనిల్, రంగానాయుడులను అరెస్టు చేశామన్నారు. వీరి మధ్య 2003 నుంచి కక్షలున్నాయని ఎస్పీ చెప్పారు.
ప్రసాద్రెడ్డి హత్య కేసులో తహసీల్దార్, ఆర్ఐ పేర్లు తొలగించాలని ఎస్పీకి రెవెన్యూ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారని, హత్యలో వారి ప్రమేయం లేకుంటే పేర్లు తొలగిస్తామని ఎస్పీ వివరించారు.