బెంగళూరు ఎటిఎం అటాకర్ మధుకర్ రెడ్డి ఇలా దొరికాడు
బెంగళూరు ఎటిఎం కేంద్రంలో మహిళ జ్యోతి ఉదయ్పై కత్తితో దాడి చేసిన నిందితుడు అనూహ్యంగా పట్టుబడ్డాడు. అతన్ని మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
చిత్తూరు: మూడేళ్ల క్రితం బెంగళూరులోని కార్పోరేషన్ బ్యాంక్ ఎటిఎం కేంద్రంలో జ్యోతి ఉదయ్ అనే మహిళపై దాడి చేసి పారిపోయిన ఆగంతకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతని కోసం కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 300 మంది పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలించినా ఫలితం దక్కలేదు.
అయితే, ఓ హత్యాప్రయత్నం కేసులో మధుకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా, బెంగళూర్ ఎటిఎం అటాకర్ కూడా అతనేనని తెలిసింది. అతను చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ముద్దలాపురం గ్రామానికి చెందినవాడు. మదనపల్లి సమీపంలోని నల్లపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా జనవరి 31వ తేదీన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మధుకర్ రెడ్డిని పట్టుకున్న పోలీసులను కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర అభినందించారు. ఐదేళ్ల క్రితం అతను ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి తప్పించుకున్నాడు. మధుకర్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టిన చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ వివరాలను అందించారు.
ఆ తర్వాత అతను కేరళకు పారిపోయాడు. కేరళలోని ఎర్నాకులంలో ఏడాది పాటు ఉన్నాడు. 2011లో జైలు నుంచి తప్పించుకున్న మధుకర్ రెడ్డి 2013లో బెంగళూర్ ఎటిఎం కేంద్రంలో మహిళపై దాడికి పాల్పడ్డాడు. అతను ఎర్నాకులం నుంచి హైదరాబాద్ వెళ్లాడు. హైదరాబాదు నుంచి పీలేరు చేరుకున్నాడు. హైదరాబాదులో ఉంటూ అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తిరగుతూ వచ్చాడు.
బెంగళూరు మహా నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలే ఒక మహిళపై దాడి జరిగింది. ఏటీఎం సెంటర్లో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన మహిళపై ఒక ఆగంతకుడు ఆ సెంటర్లోనే విచక్షణా రహితంగా వేటకత్తితో దాడి చేసి ముఖం, తలపై తీవ్రంగా గాయపరిచాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన స్థానిక బీబీఎంపీ ప్రధాన కార్యాలయం సమీపంలోని కార్పొరేషన్ సర్కిల్లో మంగళవారం జరిగింది.
మిషన్ రోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకులో మేనేజర్గా పని చేస్తూ రాజేశ్వరీ నగర్లో నివాసం ఉంటున్న జ్యోతి ఉదయ్ (38) ఉదయం 7.10 ప్రాంతంలో డబ్బు డ్రా చేయడానికి కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లారు. వెనుకే వచ్చిన దుండగుడు హఠాత్తుగా లోపలికి వచ్చి ఏటీఎం సెంటర్ షట్టర్ మూసివేశాడు. హఠాత్పరిణామాన్నుంచి తేరుకుని తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించగా.. అరవద్దంటూ గొంతునొక్కి, రివాల్వర్ చూపిస్తూ దుండగుడు బెదిరించాడు. తర్వాత డబ్బు డ్రా చేసి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో ఒక మూలకు నెట్టివేసి వేటకత్తితో ఆమెపై మూడు సార్లు దాడి చేశాడు.
దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత ఆమె ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయాడు. వెళుతూ షట్టర్ కిందికి దించేశాడు. మూడు గంటల తర్వాత ఏటీఎం సెంటర్ బయట రక్తం మరకలు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమెను తొలుత నిమ్హాన్స్ ఆస్పత్రికి, అనంతరం బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. ఎస్జే పార్కు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే డీసీపీ రవికాంత్ గౌడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలను రప్పించారు.