అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో మరో ముందడుగు...వేరొక ఆస్తి గుర్తింపు!
అమరావతి:అగ్రిగోల్డ్ కేసులో ఎపి ప్రభుత్వం మరో కీలక పురోగతి సాధించింది. ఇప్పటివరకూ వెలుగు లోకి అగ్రిగోల్డ్ డైరెక్టర్ పేరిట ఉన్న మరొక ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తాను సీరియస్ గా పరిగణిస్తున్నట్లు సిఎం చంద్రబాబు ప్రకటన నేపథ్యంలో ఈ కేసులో త్వరిత పురోగతి కనిపిస్తోంది.
నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్టణం జిల్లాల్లో అగ్రిగోల్డ్ డైరెక్టర్ పేరిట 200 ఎకరాల భూమి ఉన్నట్లు పోలీస్ శాఖ గుర్తించడం జరిగింది. దీంతో ఈ భూమిని అటాచ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్శాఖ ప్రతిపాదనలు పంపింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ పేరిట ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ. 8.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అగ్రిగోల్డ్ డైరెక్టర్ మణిశర్మ బెయిల్ పై విడుదలైన రెండు రోజుల వ్యవధిలో ఎపి ప్రభుత్వం ఈ పురోగతి సాధించడం విశేషం. అగ్రిగోల్డ్ కుంభకోణంలో అరెస్ట్ అయిన అగ్రిగోల్డ్ డైరెక్టర్ మణిశర్మ ఏలూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా ఆగష్టు 14 న బెయిల్పై విడుదలయ్యారు. అగ్రిగోల్డ్ కేసులో అవ్వా వెంకటసుబ్రమణ్యేశ్వర శర్మ అలియాస్ మణిశర్మ సహా 14 మందిని సీఐడీ అరెస్ట్ చేసింది. కాగా మణిశర్మకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు.
జులె 31 న ఉండవల్లిలోని గ్రీవెన్స్హాలు వద్ద అగ్రిగోల్డ్ బాధితుల్లో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను తాను చాలా సీరియస్ గా తీసుకుంటున్నానని...వారి ప్రతి పైసా వసూలు చేసి ఇప్పిస్తానని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. "నేను అసోసియేషన్ను ఒకటే కోరుతున్నా...మీరు బాధితుల తరఫున మాట్లాడుతున్నారు. బాధితులతో కమిటీ వేసుకోండి"...అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావుకు సిఎం సూచించారు.
అగ్రి గోల్డ్ కుంభకోణం అనేది టీడీపీ ప్రభుత్వం రాక ముందు జరిగిన అతిపెద్ద స్కామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి అందరం సమన్వయంతో కృషి చేద్దామని ఆ సందర్భంలో సిఎం చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది.