APPSC Group 2 Exam : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలో కీలక మార్పు- మెయిన్స్ లో ఇక రెండే పేపర్లు..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 2 పరీక్షా విధానంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ముఖ్యంగా ప్రిలిమ్స్ తరహాలోనే మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహించేలా కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై మెయిన్స్ పరీక్షలోనూ మూడు పేపర్ల స్ధానంలో రెండు పేపర్లే ఉండబోతున్నాయి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ ఆర్ధికశాఖ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షతో పాటు పాటు మెయిన్స్ పరీక్షలోనూ రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పు చేర్పులు చేశారు. గత విధానం తరహాలోనే ప్రిలిమినరీ పరీక్షలో 150మార్కులకు జనరల్ స్టడీస్ , మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉండగా.. మెయిన్స్ లో 450మార్కులకు 3పేపర్లకు బదులు ఇక నుంచి 300 మార్కులకు రెండు పేపర్లు మాత్రమే ఉండేలా మార్పులు చేశారు.
తాజా మార్పుల ప్రకారం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 1 లో ఏపీ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, భారతరాజ్యాగం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకు ఈ ప్రశ్నాపత్రం రూపొందించనున్నారు. మరో 150 మార్కులకు రెండో ప్రశ్నాపత్రంగా భారత ఆర్ధిక వ్యవస్ధ, ఏపీ ఆర్ధిక వ్యవస్ధ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నాపత్రం ఉండబోతోంది.
ఈ మేరకు మార్పు చేర్పులు చేస్తూ ఆర్ధికశాఖ మానవవనరుల విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పులు తదుపరి ఇచ్చే నోటిఫికేషన్ నుంచి వర్తింపచేయనున్నారు.