చివరి దశకు చేరిన ప్రత్యేకహోదా ఉద్యమం:చలసాని శ్రీనివాస్,అప్పుడే రాజ్యాధికారం:ద్వారకానాథ్
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన ఉద్యమం చివరి దశకు చేరిందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు.
ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. హోదా సాధనకు ఎవరైతే కలసిరాలేదో వాళ్లందరినీ రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రత్యేక పోహా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు, అందుకు అనుగుణమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించేందుకు త్వరలో గుంటూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
కాపుల నాయకత్వంలో బిసి,ఎస్టి, ఎస్టి, మైనార్టీలు పనిచేస్తేనే ఎపిలో రాజ్యాధికారం పొందగలుగుతారని కర్ణాటక బిసి కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ సి.ఎస్.ద్వారకానాధ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం జరిగిన రాజకీయ చైతన్య వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు సలాది గంగాధర రామారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ద్వారకానాధ్ మాట్లాడుతూ ఎపిలో రెండే కులాలు రాజ్యమేలుతున్నాయని...మిగిలిన కులాల్లో ఐక్యత లేకపోవడం వల్లే రాజ్యాధికారం దక్కడం లేదని విశ్లేషించారు. కర్ణాటకలో మైనార్టీలు, బిసిలు, దళితుల కలయిక ద్వారానే సిద్ధా రామయ్య అక్కడ ముఖ్యమంత్రి కాగలిగారని ఆయన వివరించారు. ఎపిలో ఒక్కో కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు ఇప్పిస్తామని చెబుతున్నారని, అదే రాజ్యాధికారం ఇస్తే వారికి రూ.5 వేల కోట్లు తిరిగి ఇస్తామని ద్వారకానాథ్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గురించి ప్రజలు ఆలోచించాలన్నారు.
కాపులు కులాలను సంఘటిత పర్చుకోవడం, వనరులను సమీకరించుకోవాలని చేయాలని సూచించారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు సలాది గంగాధర రామారావు మాట్లాడుతూ దళిత, బహుజన, మైనార్టీ, కాపులు కలిసికట్టుగా ప్రయాణిస్తేనే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయని స్పష్టం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్ఎ, బిజెపి నేత ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయం వ్యాపారంలాగా తయారైందని అన్నారు. కులాలను విభజించి పాలించే ఎత్తుగడను పాలకులు అవలంభిస్తున్నారని విశ్లేషించారు.