కాల్చుకొని జవాన్ సూసైడ్, ముస్తఫా కేసులో దోషిగా..
హైదరాబాద్: మొహిదీపట్నంలోని ఆర్మీ క్యాంపులో అప్పలరాజు అనే జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ముస్తఫా అనే బాలుడి మృతి కేసులో అప్పలరాజును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జవాను మృతదేహాన్ని మిలటరీ ఆసుపత్రిలో ఉంచినట్లు మిలటరీ అధికారులు తెలిపారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. జవాను మృతి పైన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సంఘటన స్థలం వద్దకు హుమాయున్ నగర పోలీసులు వచ్చారు. పోలీసులు రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు.
బయటపడుతుందనే క్షోభతో ఆత్మహత్య!
ముస్తఫా కేసులో అప్పలరాజుది కీలకపాత్రగా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో తన పాత్ర బయటపడుతుందనే భయంతోనే అప్పలరాజు ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ముస్తఫా హత్య కేసులో అప్పలరాజుది కీలకపాత్ర కాగా, మరో ఇద్దరు ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. తాను దోషిగా నిలబడే అవకాశమున్నందునే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని అంటున్నారు.
కాగా, మెహిదీపట్నంలో గత నెల ముస్తఫా అనే బాలుడికి నిప్పంటించి హత్య చేసిన విషయం తెలిసిందే. దీని పైన సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నాడు ముస్తఫా మరణంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మిలటరీ గేటు ముందు అప్పుడు క్షణక్షణం... ఉత్కంఠత కనిపించింది. జరిగిన సంఘటనపై ఓ వర్గం వారు చేరుకుంటుండటంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 100మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రత్యేక పోలీసు బలగాలు పూర్తి బందోబస్తుతో మిలటరీ గేటు ముందు కనిపించడంతో ఆ ప్రాంతం నాడు యుద్ధ్ద వాతావరణాన్ని తలపించింది.
బాలుడి అంత్యక్రియల రోజు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది. నాడు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస్ ఉదయం నుంచి సాయంత్రం బాలుడి అంత్యక్రియల వరకు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. రంగంలోకి శాంతి సంఘం సభ్యులను సైతం దింపారు.