హైదరాబాద్ తర్వాత అమరావతి, బాబుకు ఛాన్స్, ఒంటరిని చేయం: జైట్లీ
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే హైదరాబాదును అభివద్ధి చేశారని, అమరావతి ద్వారా మరో అవకాశం వచ్చిందని, ఈ కృషిలో ఆయనను ఒంటరిని చేయమని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్ల అన్నారు.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడిన మిత్రులు కొందరు వేదిక పైన, వేదిక కింద ఉన్నారని చెప్పారు. విభజన సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం వెంకయ్య గట్టిగా మాట్లాడుతుండగా నాడు సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆ మాటలు వినపడకుండా ఆందోళన చేశారన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో రూపొందించబడే ఈ నూతన రాజధాని ఓ అత్యాధునిక, అందమైన పట్టణంగా రూపుదిద్దుకుంటుందని తనకు విశ్వాసం ఉందన్నారు. భూసమీకరణ పేరిట రైతుల విశ్వాసాన్ని చూరగొన్న చంద్రబాబును అభినందిస్తున్నానని చెప్పారు.

భూమిని ఇచ్చిన రైతులను అభినందిస్తున్నానని జైట్లీ చెప్పారు. చంద్రబాబు ఎక్కడున్నా ఏపీకి పెట్టుబపడుల కోసం కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాదును చంద్రబాబు ప్రపంచంలోనే గొప్ప రాజధాని చేశారని, అమరావతిని చేసే మరో అవకాశం వచ్చిందన్నారు.
విభజన వల్ల ఏపీకి నష్టం జరగకూడదని వెంకయ్య, చంద్రబాబు పదేపదే చెప్పారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చంద్రబాబు బాగా పని చేస్తున్నారన్నారు. విదేశాల్లో తిరిగినా, ఢిల్లీకి వచ్చినా, రాష్ట్రంలో ఉన్నా ఆయన ఆలోచన అదే అన్నారు.
నూతన రాజధాని నిర్మాణంలో చంద్రబాబును ఒంటరిని చేయమన్నారు. కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. గతంలో పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చిన నిధుల కంటే మేం ఏపీకి, ఈ అయిదేళ్లలో అంతకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పారు. ఈ అయిదేళ్లలో రూ.2లక్షల 3వేల కోట్ల నిధులు కేంద్రం ఇస్తుందన్నారు.
చంద్రబాబు ఎంత వేగంగా పని చేస్తారో అందరికీ తెలుసునని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. భూసేకరణ పూర్తి కాగానే అత్యాధునిక విమానాశ్రయం నిర్మిస్తామని అరుణ్ జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు.
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలాగే ఏపీకి 90:10 శాతం నిధులు ఇస్తామని జైట్లీ చెప్పారు. ఇబ్బందులు సృష్టించకుండా రైతులు భూములు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇద్దరు ఎంపీలు సుజన, సీఎం రమేష్లు విభజనకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు.












Click it and Unblock the Notifications