బాబూ మోహన్ యోచన: సైకిల్ దిగి కారుపై షికారు?
సంగారెడ్డి: ప్రముఖ హాస్య నటుడు, మాజీ శాసనసభ్యుడు బాబూ మోహన్ సైకిల్ దిగి కారు ఎక్కే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మెదక్ జిల్లా ఆందోల్ నుంచి ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఆందోల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయన తెరాసలో చేరే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
కెసిఆర్ సూచన మేరకు మెదక్ శాసనసభ్యుడు హరీష్ రావు ఫోన్ చేసి తమ పార్టీలోకి బాబూ మోహన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బాబూ మోహన్ తెరాసలో చేరే విషయంపై ఇది వరకే తన వర్గంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన బాబూ మోహన్ తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఆందోల్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశారు.
స్థానికేతరుడు అయినప్పటికీ సినీ గ్లామర్, టిడిపి క్యాడర్ కలిసి రావడంతో ఆయన ఆందోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభకు గెలిచారు. ఓసారి కార్మిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత తెరాస వచ్చి, రాజకీయ సమీకరణాలు మారడంతో రెండు సార్లు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతిలో ఓటమి పాలయ్యారు.
అందోల్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్న మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం నాయకుడు మాణిక్ రెడ్డి ఇటీవల తెరాసలో చేరారు. బాబూ మోహన్ను తెరాసలోకి తెచ్చేందుకు ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో పట్టు సంపాదించారు. తెరాస కాంగ్రెసులో విలీనమైతే రెంటికి చెడిన రేవడి అవుతుందా అనే సందేహం బాబూ మోహన్ను పీడిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెసు టికెట్ లభించక, అటు టిడిపికి దూరమై నష్టపోతానేమో అనే ఆందోళనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.