యెన్నంపై బిజెపి ఆగ్రహం, క్షమాపణ వద్దన్న వెంకయ్య
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇటీవల భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు పైన ఆ పార్టీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన సంజాయిషీ ఇవ్వాలని చెప్పారు.
బుధవారంలోపు క్షమాపణ చెప్పేలా చూడాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. దానికి స్పందించిన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డిలు క్షమాపణ చెప్పిస్తామని ప్రతిపాదించారు. దానికి వెంకయ్య సున్నితంగా తిరస్కరించారు. జరిగిన పొరపాటు తెలుసుకొని సరిచేసుకుంటే చాలన్నారు.
యెన్నం విమర్శలపై అధిష్టానం తీవ్రంగా స్పందించింది. తగ్గకుంటే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలనే ఆలోచన కూడా చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్నాథ్ను కలిసిన అనంతరం కిషన్ రెడ్డి, నాగం, విద్యాసాగర రావు తదితరులు వెంకయ్యను కలిశారు.
యెన్నం చాలా తప్పుగా మాట్లాడారని, ఆయనతో క్షమాపణ చెప్పిస్తామని వారు కోరగా అందుకు వెంకయ్య తిరస్కరించారు. వ్యక్తులకు తాను ప్రాధాన్యం ఇవ్వబోనని, ఆయన తనను కాదు పార్టీని విమర్శించినట్లైందని వెంకయ్య అన్నారు. క్షమాపణ కావాలంటే బయట ప్రకటించాలని తనను కలుసుకోనవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు తాను వెంకయ్య నాయుడుకు క్షమాపణలు చెప్పలేదని యెన్నం బుధవారం అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదింప చేయాలా అని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు.