వెంకయ్యనంటావా, పీఆర్పీ-2, తిరుపతి లడ్డూలు: పవన్పై బీజేపీ ఎదురుదాడి
అమరావతి/న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పైన బీజేపీని, కేంద్రాన్ని, ముఖ్యంగా వెంకయ్య నాయుడును నిలదీసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆయన పైన ఎదురు దాడి చేస్తున్నారు.
చంద్రబాబు సంగతేంటి?: పవన్ కళ్యాణ్, కేటీఆర్కు ధీటైన కౌంటర్
బిజెవైఎం ఏపీ చీఫ్ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ ప్రసంగం వింటుంటే రచయితలు రాసిచ్చిన స్క్రిప్టు మర్చిపోయి మాట్లాడుతున్నట్టు ఉందన్నారు. సినిమాల్లో నటించి బ్లాక్మనీ కూడగట్టుకుంటున్న పవన్కు కేంద్రం ఇచ్చిన నిధులు పాచి లడ్డూల్లా కనిపిస్తున్నాయా? అని ధ్వజమెత్తారు.
కావాలంటే ప్రజారాజ్యం పార్టీ -2 అని పెట్టుకోవాలని, కానీ తమ పార్టీ నేతలను విమర్శించే ముందు చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఆరు నెలలు పడుకుని ధ్యాననిద్ర చేస్తే పనికిరాదని, ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చిల్లర ఓట్లకే తప్ప, రాష్ట్రాభివృద్ధికి పనికి రాదన్నారు. అవంతి శ్రీనివాస్ను గెలిపించుకుంటానన్న పవన్ కళ్యాణ్ అంత శక్తిమంతుడైతే, అల్లు అరవింద్ను గెలిపించి, చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేకపోయారన్నారు.
వెంకయ్య చొరవతోనే రూ.2.25 లక్షల కోట్లు: హరిబాబు
కేంద్రమంత్రి వెంకయ్య చొరవతోనే ఏపీకి రూ.2.25 లక్షల కోట్లు వచ్చాయని ఎంపీ హరిబాబు అన్నారు. విభజనతో అభివృద్ధి సాధ్యమని బీజేపీ నమ్మిందన్నారు. వెంకయ్యను విమర్శించడం సరికాదన్నారు. వ్యక్తిగత ఆరోపణలు చేసేముందు సంయమనం పాటించాలన్నారు.
సిద్ధార్థనాథ్ సింగ్ సవాల్
వెంకయ్యను విమర్శించే స్థాయి పవన్కు లేదని ఏపీ బిజెపి వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. ఎదిగే కొద్దీ ఒదగాల్సిన పవన్ కళ్యాణ్, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్యాకేజీపై పవన్ సహా ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ధైర్యముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు.
ఓ ప్రశ్న వేస్తా, ప్రతిదీ హైదరాబాద్ కాదు: కేవీపీకి వెంకయ్య ప్రశంస, పవన్కు కౌంటర్
ఎన్డీయేలో జనసేన అన్న పార్టీయే లేదని, ఒకవేళ ఉంటే ఎప్పుడు చేరిందన్న విషయాన్ని పవన్ను అడగాలని సూచించారు. ఆయనకు పరిపాలనా అనుభవం లేదన్నారు. రాష్ట్రానికి మేలు చేయాలని ఆలోచించే వెంకయ్యపై విమర్శలు సరికావన్నారు.
అవి తిరుపతి లడ్డూలు: జవదేకర్
ఏపీకి కేంద్రం ఇచ్చిన లడ్డూలు పాచిపోయిన లడ్డూలు కాదని, తిరుపతి లడ్డూలు అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఏపీకి హోదా ఇవ్వడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు.
కొందరు అతి చేస్తున్నారు: వెంకయ్య
కొందరు అతిగా మాట్లాడుతున్నారని వెంకయ్య కూడా కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీని తాము ఆదుకుంటామని చెప్పారు. ఏపీని ఆదుకునే విషయానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. విభజన చట్టంలో పదేళ్లలో చేయమని చెబితే, తాము రెండేళ్లలోనే చేశామన్నారు.