నిరంకుశంగా: మోడీపై మురళీమోహన్, సత్తా చూపిద్దాం: జేసీ, 'వివేకా తర్వాత పులివెందులలో జగన్ షాకిస్తాం!'
అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక హోదాపై విషయమై మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ శుక్రవారం అన్నారు. లోకసభలో అవిశ్వాసంపై చర్చ జరగకుండా బీజేపీ నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
అగ్రిగోల్డ్ షాక్: 'వైసీపీ వల్లే జీ గ్రూప్ వెనక్కి, త్వరలో సంచలన విషయాలు, పవన్ కళ్యాణ్ చెప్పారుగా'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉద్యమిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
తెలుగు ప్రజల సత్తా మోడీకి చూపిద్దాం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆయన శుక్రవారం అనంతపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీకి నరేంద్ర మోడీ ఏం చేయరని చెప్పారు. తెలుగు ప్రజల సత్తా ఏమిటో మోడీకి చూపిద్దామన్నారు. ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని చెప్పారు.
ప్రధాని మోడీకి ఆ ఆలోచన లేదు
కేంద్రం సహకరించకపోయినా మనకు కష్టపడే సీఎం ఉన్నారని, తల తాకట్టు పెట్టి అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని టీడీపీ ఏపీ అద్యక్షులు కళా వెంకట్రావు గురువారం అన్నారు. కక్ష సాధింపే తప్ప దేశాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీకి లేదని ఆయన మండిపడ్డారు.
వైయస్ వివేకాను ఓడించాం, జగన్ను ఓడిస్తాం
కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఓడించి బీటెక్ రవిని గెలిపించుకున్నామని, వచ్చే ఎన్నికల్లో జగన్ను కూడా ఓడించి పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. పులివెందులలో వైయస్ కుటుంబానికి అసాధ్యమైన పనులను తమ ప్రభుత్వం చేసి చూపిస్తోందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు.
మోడీని అడిగే ధైర్యం లేదా?
పార్లమెంటును నడవనీయని బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శించడం లేదని మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. జగన్కు మోడీని అడిగే ధైర్యం లేదన్నారు. చంద్రబాబును మాత్రం నిత్యం విమర్శిస్తారన్నారు. హోదా ఎవరు ఇవ్వాలో జగన్కు తెలియదా అన్నారు. ప్రతిపక్షాల చర్యకు నిరసనగా మోడీ దీక్ష చేయడం విడ్డూరమన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఇష్టం లేకపోతే తన మీద తానే విశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు కదా అని నిలదీశారు. బీజేపీతో టీడీపీ ఎప్పుడు తెగదెంపులు చేసుకుంటుందా, ఎప్పుడు వెళ్లి కలుద్దామా అని జగన్ ప్రయత్నించారని, చీకటి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.