దిక్కుమాలిన..: బైరెడ్డి, ఆలస్యంగా మేల్కొన్న జగన్, 'మాపై ప్రచారమా'
కర్నూలు/కడప: ఏపీలో రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు దిక్కుమాలిన రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి బుధవారం హితవు పలికారు. కర్నూలు జిల్లా పెద్దకడుగూరు, మంత్రాలయం మండలాల్లో బస్సు యాత్ర చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, వలసల కారణంగా రాయలసీమలో జనాభా తగ్గుతోందన్నారు. ఇప్పటికైనా రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఇక్కడి పిల్లల భవిష్యత్కు భరోసా కల్పించాలని, ఈ దిశగా ప్రభుత్వాలు చేయాల్సింది ఎంతో ఉందని, ఇలాంటి సమయంలో ఫిరాయింపుల గోలేమిటన్నారు.
జగన్ను కలిసిన ఎమ్మెల్యేలు
మైదుకూరు, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రకటన చేశారు. తాము వైసిపిలోనే ఉంటామని చెప్పారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామ రెడ్డి ఉదయం జగన్ను కలిశారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. తాను జగన్ వెంటే ఉంటానని చెప్పారు. పార్టీలు మారడం అనైతికమన్నారు. టీవీ 9 అంటే గౌరవం ఉందని, కానీ వాళ్లు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. పార్టీ మారే అవకాశమే లేదన్నారు. మా లాంటి వాళ్ల మీద ఇలాంటి ప్రచారం వద్దన్నారు. చంద్రబాబుకు తెలంగాణలో ఓ న్యాయం, ఏపీలో మరో న్యాయమా అన్నరు. తెలంగాణలో పార్టీ మారితే వ్యతిరేకిస్తూ, ఇక్కడ మాత్రం సమర్థించడమేమిటన్నారు.
మంత్రి పదవులు, డబ్బు మూటలు, కేసుల నుంచి బయటపడటమే లక్ష్యంగా పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తున్న వాళ్లకు జగన్ను విమర్శించే నైతికత లేదని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా అన్నారు. ఉదయం జగన్ను కలిసిన అనంతరం అంజాద్ మీడియాతో మాట్లాడారు.
పార్టీ వీడిన వాళ్లకు రాజకీయ భవిష్యత్ ఉండదని, మరోసారి ఎన్నికలకు వెళితే వారిని ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. పార్టీలు మారిన వారు రాజీనామాలు చేసి, తిరిగి గెలిచి చూపించాలన్నారు.
ఇదిలా ఉండగా, ఏపీలో అధికార పార్టీ టిడిపి ఆకర్ష్కు తెరలేపి వైసిపికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని చేర్చుకున్నాక జగన్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆలస్యంగా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి హైదరాబాదుకు వచ్చిన ఆయన గురువారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.
కడప జిల్లాకు చెందిన మరో ముగ్గురు నేతలు టిడిపిలో చేరనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన పార్టీ నేతలను పిలిపించి చర్చించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు కడప జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు జగన్ ను కలసి మాట్లాడారు. మరోవైపు, లోకేష్ కడపలో పర్యటిస్తున్నారు. వైసిపి నేతలకు గాలం వేస్తున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications