సీఎం జగన్ తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం : ప్రధానికి రెండు రాష్ట్రాలు రెండు కళ్లు..!!
తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం స్విమ్స్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. మధ్యాహ్నం కనక దుర్గమ్మను కిషన్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డికి సీఎం ఎదురెళ్లి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. అలాగే కిషన్రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు.
రాష్ట్రంలో పరిస్థితుల గురించి కిషన్ రెడ్డి వాకబు చేసారు. కాగా, కేంద్రం వద్ద పెండింగ్ అంశాలను సీఎం జగన్ వివరించారు. కేంద్రం నుంచి..ప్రత్యేకంగా తన శాఖకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కిషన్ రెడ్డి ఈ సమావేశంలో సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. ఇక, అంతకు ముందు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని కేంద్ర టూరిజం శాఖా మంత్రి కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం తాను వచ్చానన్నారు.
దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దేందుకు తన సహకారం అందిస్తానన్నారు. నిన్న తిరుమల వెంకన్న స్వామిని, ఇవాళ దుర్గమ్మను దర్శించుకున్నానన్నారు. దేశ సంస్క్రతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారన్నారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో గల వీరబద్ర దేవాలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిందన్నారు. ఏపీలో 126 పురాతన కేంద్రాలున్నాయి. రానున్న రోజుల్లో వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్అర్ ఫండ్ కింద డెవలప్ చేస్తామని కిషన్రెడ్డి తెలిపారు.
ఏపీ సీఎం జగన్ను కలిసిన కేంద్రమంత్రి @kishanreddybjp #kishanreddy #jaganMohanReddy pic.twitter.com/SPp0SEODUF
— oneindiatelugu (@oneindiatelugu) August 19, 2021
Recommended Video
టూరిజం శాఖ చాలా ఛాలెంజ్తో కూడుకుందన్నారు. గత రెండేళ్లుగా కోవిడ్తో టూరిజం దెబ్బతిందన్నారు. జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. పర్యటక శాఖ ద్వారా తన వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తానని కిషన్రెడ్డి పేర్కొన్నారు. అయితే, ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిథ్యం లేకపోవటంతో..ఏపీకి సంబంధించిన వ్యవహారాలను కిషన్ రెడ్డికే అప్పగించారు. దీంతో..ఇప్పుడు కిషన్ రెడ్డి పర్యటన ఏపీలో ఆసక్తి కరంగా మారింది.