మోడీ ఇష్యూ: బాబు-కేసీఆర్ గొడవపై ప్రస్తుతానికి కేంద్రం దూరం!
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ గొడవ పైన కేంద్రం పూర్తిగా దృష్టి కేంద్రీకరించే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కేంద్రం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంతో రాజకీయంగా చిక్కులు ఎదుర్కొంటోంది. లలిత్ మోడీకి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వీసా ఇప్పించారనే అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. విపక్షాలు దీనిని ఘాటుగా ప్రశ్నిస్తున్నాయి. దీంతో, కేంద్రం ప్రధానంగా దాని పైనే దృష్టి సారించిందని చెప్పవచ్చు.
వసుంధర రాజే - సుష్మా స్వరాజ్ - లలిత్ మోడీ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రగడ పైన ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ప్రస్తుతం లేదని అంటున్నారు.
హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్న తెలుగుదేశం పార్టీ నేతల వాదనతో లేక రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంపై ప్రస్తుతం కేంద్రం దృష్టి పెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు.
అంతేకాకుండా, ఇప్పుడే కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి కూడా రాలేదని చెబుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకుంటే బీజేపీ ఇమేజ్ దెబ్బతింటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయంట.
ప్రస్తుతం విచారణ సంస్థల చేతుల్లో కేసులు ఉన్నాయని, నిజాలు బయటకు రావాల్సి ఉందని, ఫోరెన్సిక్ ల్యాబ్ రికార్డులు బయటకు రావాల్సి ఉందని ఆ తర్వాత విషయాలు తెలుస్తాయని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో బీజేపీ ఇప్పుడే కల్పించుకోదని ఏపీ మంత్రి, బీజేప నేత కామినేని కూడా చెప్పారు.
మొత్తానికి, ఒకటి కేంద్రంలోని తాజా పరిస్థితి, రెండు తెలుగు రాష్ట్రాల గొడవలు విచారణ సంస్థలు, న్యాయ పరిధిలో ఉండటంతో కేంద్రం ఒకింత దూరంగా ఉంటుందని చెబుతున్నారు.