బాషా అప్పుడే తేల్చేశారు: అసెంబ్లీలో జగన్ మైక్ కట్ చేసినప్పుడే...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనంతపురం జిల్లా కదిరి శాసనసభ్యుడు చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లోనే సంకేతాలు ఇచ్చారు. అసెంబ్లీలో చాలా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనను ఇప్పుడు చాలా మంది గుర్తు చేస్తున్నారు.
ఎపి అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్లలో చాంద్ బాషా ఒకరు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఓసారి స్పీకర్ స్థానంలో కూర్చుని సభను నడిపించాల్సి వచ్చింది. ఆ సమయంలో వైయస్ జగన్ మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ తనకు ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకుంటూ ప్రసంగాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు.
స్పీకర్ స్థానంలో ఉన్న చాంద్ బాషా జగన్ను ఒక్కటి రెండు సార్లు హెచ్చరించారు. ప్రసంగాన్ని ముగించాలని సూచించారు. అయినా జగన్ తన ప్రసంగాన్ని ముగించలేదు. అయితే, జగన్ ప్రసంగం చేస్తుండగా బాషా మైక్ కట్ చేయించారు. జగన్ మైక్ను బాషా కట్ చేయించడంపై అప్పట్లో తీవ్రమైన చర్చనే సాగింది.
చాంద్ బాషా పార్టీ మారే ఆలోచనలో ఉండడం వల్లనే జగన్ను బేఖాతరు చేస్తూ మైక్ కట్ చేయించడానే ప్రచారం కూడా సాగింది. దాంతో ఆగకుండా తన నియోజకవర్గానికి వెళ్లినప్పుడు బాషా కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి కారు అద్దాలు పగులగొట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలే ఆ పనికి పూనుకున్నట్లు కూడా ప్రచారం సాగింది.
అప్పుడు అనుకున్న విధంగా చాంద్ బాషా శుక్రవారంనాడు విజయవాడకు బయలుదేరి వెళ్లి శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో సైకిలెక్కేశారు.