జాతీయ సంచలనం: బాబుకు ములాయం ఫోన్, స్వాగతించిన మమతా
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ నుంచి వైదొలుగుతూ ప్రకటన చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎనలేని మద్దతు లభిస్తోంది. చెప్పినట్లుగానే చంద్రబాబు నిర్ణయం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది.
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఎన్డీఎ నుంచి టిడిపి వైదలగడాన్ని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు.
మరోసారి టిడిపి నోటీసు
మరోసారి సోమవారం అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ నోటీసు ఇవ్వనుంది. సభలో గందరగోళ పరిస్థితి ఉండడంతో శుక్రవారం అవిశ్వాస తీర్మానాలను చేపట్టలేకపోయినట్లు చెప్పి స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభను సోమవారానికి వాయిదా వేశారు. దాంతో తాము ఇచ్చే నోటీసుపై ఇతర పార్టీల ఎంపీల సంతకాలు తీసుకోవడానికి టిడిపి ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంపీల మద్దతు
ఇప్పటి వరకు 40 మంది సభ్యులను సంతకాలను టిడిపి ఎంపీలు సేరించినట్లు తెలుస్తోంది. మజ్లీస్ అధినేత అసదద్దీన్ ఓవైసీ నోటీసుపై సంతకం చేశారు. దాదాపు 80 మంది మద్దతు లభిస్తుందని టిడిపి ఎంపీలు అంటున్నారు. తోట నర్సింహం, సిఎెం రమేష్ ఇతర పార్టీల ఎంపీల సంతకాలను సేకరించే పనిలో పడ్డారు.
రెండింటికీ కాంగ్రెసు మద్దతు
టిడిపి, వైసిపిలు ప్రతిపాదించే రెండు అవిశ్వాస తీర్మానాలకు కూడా మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంది. వాటికి మద్దతు కూడగట్టేందుకు కూడా కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్లికార్జున్ ఖర్గే, జ్యోతిరాదిత్య, ఆజాద్ ఆ పనిలో ఉన్నారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న 20 పార్టీల నేతలను వారు సంప్రదిస్తున్నారు. అందులో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయి.
జాలరి వేషంలో శివప్రసాద్
ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు శుక్రవారంనాడు కూడా ఆందోళనకు దిగారు. టిడిపి ఎంపి శివప్రసాద్ శుక్రవారంనాడు జాలరి వేషంలో తన నిరసనను వ్యక్తం చేశారు. ఆయన రోజుకో వేషంతో కేంద్ర ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
స్పీకర్పై టిడిపి మండిపాటు
సభ ఆర్డర్లో లేకపోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టలేకపోతున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రకటనపై టిడిపి ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభ ఆర్డర్లో లేకపోయినా, చర్చ లేకుండా ఆర్థిక బిల్లును ఆమోదింపజేసుకున్నారని, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వచ్చేసరికి సభ ఆర్డర్లో ఉండాలని అంటున్నారని వారు తప్పు పట్టారు.