చంద్రబాబు లేఖ ఇచ్చిన షాక్: ఎవరేమిటో తెలియక...
హైదరాబాద్: దసరా పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేర జారీ అయిన ప్రకటన సమాచార శాఖకు షాక్ ఇచ్చింది. ఆ లేఖ ఎక్కడి నుంచి విడుదలైంది, ఎవరు విడుదలైంది తెలియక తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో అధికార కేంద్రాలు పెరగడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
చంద్రబాబునాయుడు పేరుతో విడుదలయిన బహిరంగలేఖ గురించి సమాచారశాఖకే సమాచారం లేదని అంటున్నారు. విజయదశమి సందర్భంగా రాష్ట్రంలో తన ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే ఏడాదిలో సాధించనున్న విజయాలను వివరిస్తూ ఆ లేఖ రాశారు. అందులో ఎక్కువగా అమరావతి, ఇంధన శాఖ అభివృద్ధినే ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి పేరుతో విడుదలైన లేఖ సోమవారం ఉదయం పత్రికల్లో చూసిన సమాచార శాఖ అధికారులు షాక్ తిన్నారు. తమకు తెలియకుండా, తమకు ముందస్తు సమాచారం లేకుండా, ఆ లేఖ ఎలా విడుదలయిందో, ఎవరు రూపొందించారో తెలియక ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎంఓ అధికారులను సంప్రదిస్తే తమకూ తెలియదని సమాచారం వచ్చింది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే అందులో అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, దానికిబదులు ఒకటి రెండు రంగాలను ప్రస్తావించడం ద్వారా మిగిలిన రంగాలను సీఎం విస్మరిస్తున్నారనే అభిప్రాయం కలిగేలా లేఖ ఉందని అంటున్నారు.
కాగా, ముఖ్యమంత్రి పేరుతో విడుదలయిన లేఖ అటు సమాచారశాఖ కార్యాలయానికి, ఇటు మీడియా సలహాదారు (కమ్యూనికేషన్) కార్యాలయానికి తెలియకపోవడం చర్చకు దారి తీసింది. సాధారణంగా ఇలాంటి లేఖలతోపాటు కీలమైన ప్రకటన ఉంటే, మీడియా సలహాదారు లేదా సమాచారశాఖ కమిషనర్తో సీఎంఓ కార్యాలయం సంప్రదించి, తుది నిర్ణయం తీసుకుని, దానిని సీఎంకు చూపించి, ఆయన నుంచి దిద్దుబాటు జరిగిన తర్వాత తర్వాతనే అధికారికంగా విడుదల చేస్తుంటారు.
కానీ దసరా పర్వదినం సంద్భంగా విడుదలైన లేఖ మాత్రం ఎవరికీ తెలియకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రావడంపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే మీడియా సలహాదారు (కమ్యూనికేషన్)గా డాక్టర్ పరకాల ప్రభాకర్ ఉండగా, ఢిల్లీ నుంచి ఏరి కోరి తెచ్చుకున్న వెంకటేశ్వర్ సమాచార శాఖ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఇంధనశాఖలో సీఈఓ, డైరక్టర్గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్రెడ్డికి ఇంధన వౌలిక సదుపాయాలు పెట్టుబడులు, సీఆర్డిఏ మీడియా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఢిల్లీలో మీడియా వ్యవహారాలను చూసేందుకు ఓఎస్డీ బాధ్యతలు మరొక మాజీ జర్నలిస్టుకు అప్పగించారు. వీరుకాకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు కథనాల ద్వారా వివరించేందుకు, సమాచార శాఖ ఆధ్వర్యాన గతంలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులతో జాయింట్ డైరక్టర్ ఆధ్వర్యాన రీసెర్చి అండ్ రిఫరెన్స్వింగ్ ఏర్పాటుచేశారు. అధికారుల సంఖ్య పెరిగిపోవడంతో ఎవరు ఓ బాధ్యతలు నిర్వహించాలనే విషయంపై గందరగోళం ఏర్పడింది.