మళ్లీ తెరపైకి పీపీపీ మెడికల్ కాలేజీలు..! చంద్రబాబు డెడ్ లైన్ ఇదే..!
ఏపీలో మరోసారి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల (medical colleges) నిర్మాణం వ్యవహారం తెరపైకి వస్తోంది. గతంలో మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్ని పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచినా విపక్ష వైఎస్సార్సీపీ హెచ్చరికల నేపథ్యంలో టెండర్లు రాలేదు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల నిర్మాణం మూలన పడింది. దీన్ని తిరిగి గాడినపెట్టేందుకు వీలుగా సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని సీఎం చంద్రబాబు.. అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని సూచించారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్లో మెడిసిటీల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. అమరావతిలో నేచరోపతి సంస్థ కేంద్ర నెలకొల్పేలా ఆయుష్ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ విధానంలో వద్దని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కానీ లేకపోతే కేంద్ర నిధులతో చేపట్టాలని విపక్ష వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పీపీపీ విధానంలో కాలేజీల నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications