ముద్రగడపై ఎదురుదాడికి చంద్రబాబు జట్టు ఇదే, కౌంటర్ ఇలా...
కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడను ఎదుర్కోవడానికి చంద్రబాబు ఓ జట్టును తయారు చేశారు. ఆ జట్టులో మంత్రులున్నారు..
విజయవాడ: కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ జట్టును ఏర్పాటు చేశాడు. ముద్రగడ ముందుకు అడుగు వేసిన ప్రతిసారీ, ప్రకటన చేసిన ప్రతీ ఘడియలో వారు ఎదురుదాడికి వారు దిగుతున్నారు.
ముద్రగడను ఎదుర్కోవడానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురు మంత్రులను, ఓ ఎమ్మెల్యేను చంద్రబాబు నియోగించినట్లు కనిపిస్తున్నారు. వారు ఎప్పటికప్పుడు ముద్రగడకు సమాధానం చెబుతూ వస్తున్నారు. వ్యూహాత్మకంగా వారు ముద్రగను తిప్పికొట్టే ప్రయత్న చేస్తున్నుర.
రిజర్వేషన్ల కోసం కాపు జేఏసీ చేపట్టిన దశలవారీ ఆందోళనలో సోమవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొవ్వొత్తులతో జరిగిన ర్యాలీలు జరిగాయి. గన్నవరం సెంటర్లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీ, ప్రదర్శనలో ముద్రగడ పాల్గొన్నారు.
ఆ ర్యాలీలో ముద్రగడ పద్మనాభం మాట్లాడిన వెంటనే మంత్రులు ఎదురుగాడికి దిగారు. కాపులను బీసీల్లో చేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అంటూనే ముద్రగడపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముద్రగడ ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మంత్రులు సోమవారం ఓ బహిరంగ లేఖ రాశారు.
ముద్రగడ ప్రకటన ఇదే...
ఈ నెల 25న రావులపాలెం నుంచి జరపతలపెట్టిన కాపు సత్యాగ్రహ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ముద్రగడ గన్నవరం ర్యాలీలో పిలుపునిచ్చారు. రాత్రి 7.30 గంటల నుంచి గంటన్నర సేపు జరిగిన ఈ ధర్నాలో పలువురు కాపు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
ఆ నలుగురు మంత్రులు...
కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని ఏపీ కాపు మంత్రులు ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం, ఈ ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. ముద్రగడపై ఎదురుదాడికి దిగుతూ కాపు మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, మృణాళిని బహిరంగ లేఖ రాశారు.
ఆ నలుగురు మంత్రులతో పాటు...
ముద్రగడపై ఎదురుదాడికి ఆ నలుగురు మంత్రులతో పాటు శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు కూడా ముందుకు వస్తున్నారు. ముద్రగడపై ఆయన కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. కాపుల కోసం చంద్రబాబు నాయుడు ఎంతో చేస్తున్నారని, కాపు సామాజిక వర్గం ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నారని ఆయన చెబుతూ వస్తున్నారు.
ఆ కుల నాయకుల ప్రస్తావన ఇలా...
ఉద్యమం లక్ష్య సాధన నుంచి పక్కకు మళ్లీ వ్యక్తిగత కక్ష పూరితంగా వెళుతుందంటూ మంత్రులు ముద్రగడకు లేఖాస్త్రం సంధించారు. ముద్రగడ చేస్తున్న ప్రకటనలు, ఆయన రాస్తున్న లేఖలు, ఆయన భేటీలన్నీ కాపు జాతికి కీడు చేసేవిగా ఉన్నాయని ఆ లేఖలో విమర్శించారు. అయినా ముద్రగడలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా ఉద్యమం నిర్వహిస్తున్న మందకృష్ణ, పీవీరావు, జూపూడి లాంటి నాయకులు ఏనాడు కుల ప్రయోజనాలను పక్కకు పెట్టలేదని తెలిపారు.
చంద్రబాబుకు వారి సమర్థన ఇలా...
కాపుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ప్రతిపక్ష నాయకుడికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారని ముద్రగడపై మంత్రులు విమర్శనాస్త్రాలు సంధించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, వై.ఎస్.రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని విస్మరించారని మంత్రులు అన్నారు.
వైఎస్ ప్రస్తావనతో కౌంటర్..
కాపులకు వైఎస్ ఇచ్చిన హామీని మరిచిపోయారని ప్రస్తావిస్తూ ఆ నలుగురు మంత్రులు - "పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మీరు ఏనాడూ కాపుల గురించి నోరు మెదపలేదు. తెదేపా అధికారంలోకి వచ్చాక కాపుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ, వారిని బీసీల్లో చేర్చడానికి మంజునాథ కమిషన్ను కూడా వేసింది. కాపులకు బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు ఎంతో అవసరమైన పల్స్ సర్వేని నీరు గార్చేలా ప్రకటన చేస్తే మీరు ఎందుకు ఖండించలేదు? కేవలం వ్యక్తిగత లాభాల కోసంసామాజికవర్గ ప్రయోజనాలకు హానికలిగేలా ప్రవర్తిస్తున్నారు" అని అన్నారు.
జగన్ను చూపుతూ ఇలా...
ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం నడుచుకుంటున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. జగన్ కోసమే ఆయన కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ కనుసన్నల్లోనే ముద్రగడ నడుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప మంగళవారంనాడు కూడా విమర్శించారు. దీన్ని బట్టి జగన్ను చూపుతూ ముద్రగడ ప్రాబల్యాన్ని అరికట్టే వ్యూహంతో వారు నడుస్తున్నట్లు కనిపిస్తోంది.