కూరగాయలకు బస్సులు పెట్టాం, దళారులు: బాబు
హైదరాబాద్: కూరగాయాలను రైతు బజార్లకు తరలించుకోవడానికి గతంలో తాము తెల్లవారు జామున గ్రామాల నుంచి ప్ర్తత్యేకంగా ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేశామని, వాటిని తొలగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరిగి వాటిని ప్రవేశపెట్టాలని ఆయన ఆదేశించారు. రైతు, మహిళా సంఘాల స్థానంలో మధ్య దళారులు వచ్చేశారని, వారిని దశలవారీగా తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలపై నిరంతర నిఘా ఉంచాలని అన్నారు.
ముందస్తు ప్రణాళికల ఆధారంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులు నిల్వల లభ్యతను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. తక్కువ ధరకు లభ్యమయ్యే ప్రాంతాల నుంచి నిల్వలు సేకరించి రైతు బజార్లు, చౌకధరల దుకాణాల ద్వారా విక్రయాలు చేపట్టాలన్నారు. ధరల నియంత్రణపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఉన్న 80 రైతుబజార్ల నిర్వాహణను చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

కూరగాయలు నిల్వ చేసుకొనేందుకు శీతల గిడ్డంగులను అందుబాటులోకి తేవాలని సూచించారు. రైతుల ఆధార్ కార్డు నెంబర్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయాలని సూచించారు. తద్వారా దళారుల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. రైతు బజార్లలో విక్రయించే ధరలను ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, తాడేపల్లిగూడెంలలో ఉల్లి నిల్వ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
కుప్పం తరహాలో సహకార పద్ధతిలో సంచార విక్రయశాలలను రైతుల ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వాహనాల కొనుగోలుకు ప్రోత్సహిస్తామన్నారు. దేశవ్యావ్తంగా పెసరపప్పు, మినప్పప్పు ధరలు పెరుగుతున్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంజయ్జాజు సీఎంకు వివరించారు.
నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. వ్యవసాయ, ఆర్థిక, ఉద్యానవన, రైతుబజార్లు, మార్కెటింగ్, రెవెన్యూ అధికారులతో కూడిన 14 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications