రాజకీయ పరిణితి లేదు.. చంద్రబాబుది కక్షపూరిత వ్యవహారం : చిరంజీవి ఫైర్
హైదరాబాద్ : కాపు సామాజిక వర్గం విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి, కాపు వర్గం నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి కూడా సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని తప్పుబట్టారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు నేపథ్యంలో.. శనివారం నాడు ఓ బహిరంగ లేఖను విడుదల చేసిన చిరంజీవి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. కాపుల మద్య చిచ్చు పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ముద్రగడ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకించిన చిరంజీవి, తుని అల్లర్లకు సంబంధించిన అరెస్టుల విషయంలో ప్రభుత్వం ఏకపక్ష పోకడలు అవలంబిస్తోందని మండిపడ్డారు. తని ఘటనకు బాధ్యలైన వారిని ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిందేనని చెప్పిన చిరంజీవి, నిందితులను గుర్తించే విధానమంతా చట్ట ప్రకారం జరగాలని సూచించారు.
తుని ఘటనలో గోదావరి జిల్లా వాసుల ప్రమేయం ఏమాత్రం లేదని, గతంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అరెస్టులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు చిరంజీవి.
సామాజిక అంశాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయ పరిణతి ప్రదర్శించాల్సింది పోయి ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పారు. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన ప్రభుత్వం ముద్రగడ దీక్షకు రాజకీయాలను ఆపాదిస్తూ, అసలు సమస్యను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు.
తొలి నుంచి ముద్రగడ విషయంలో ప్రభుత్వం వ్యతిరేక పోకడలనే కొనసాగిస్తోందని, ఘర్షణాత్మక వైఖరితో సీఎం చంద్రబాబు ఏం సాధించాలకుంటున్నారో ఆయనకే తెలియాలని అన్నారు. తుని ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించడమే సరైందని చెప్పుకొచ్చారు.
సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా సంయమనంతో సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు చిరంజీవి.