అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు: ఐవైఆర్
నిధుల వినియోగ ధ్రువీకరణ (యూసీ) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. యూసీల విషయంలో చంద్రబాబు చెబుతున్న మాటలు...చేస్తున్న ప్రచారం అవాస్తమని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు.
కేంద్రం ఎపి ప్రభుత్వాన్ని లోటు బడ్జెట్ విషయంలో యూసీ అడుగుతోందంటూ చంద్రబాబు చెబుతోంది అబద్దమన్నారు. సంక్షేమరంగానికి కేటాయించిన నిధులకు సంబంధించే కేంద్రానికి రాష్ట్రం యూసీ ఇవ్వాల్సి ఉంటుందే తప్ప, చంద్రబాబు చెబుతున్నట్లుగా లోటు బడ్జెట్ కు కాదని ఐవైఆర్ స్పష్టం చేశారు.
నిజంగా నిధుల దుర్వినియోగం జరగకపోతే యూసీలు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. అయితే నిధుల దుర్వినియోగం,నిబంధనలకు వ్యతిరేకంగా నిధుల మళ్లింపు జరిగితేనే నిధుల వినియోగ ధ్రువీకరణ ఇవ్వడానికి వెనకాడతారన్నారు. ప్రస్తుతం ఎపి ప్రభుత్వం వ్యవహారం చూస్తే అలాంటివి జరిగినట్లు అనుమానాలు వస్తున్నాయని ఐవైఆర్ చెప్పారు.
మరోవైపు రాజధాని నిర్మాణానికి అప్పులు ఇవ్వాలంటూ ప్రజలకు చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తి ప్రమాదకరంగా మారుతోందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు. ఏపీలో ఇప్పటికే మూడు పెద్ద నగరాలు ఉన్నాయని...అలాంటప్పుడు మళ్లీ మరో మెగాసిటీ ఎందుకని ఐవైఆర్ ప్రశ్నించారు. ఎపికి నూతన రాజధానిగా కేవలం పాలనా పరమైన రాజధాని నిర్మిస్తే సరిపోతుందనేది తన అభిప్రాయమని చెప్పారు. తాను రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే అందుకోసం ఏకంగా రాష్ట్రాభివృద్ధినే పణంగా పెట్టడం సరైందని కాదని అన్నారు.