మెదక్ ప్రచారానికి తెర: కెసిఆర్కు మెజారిటీ సవాల్
మెదక్: మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెదక్ లోకసభ ఉప ఎన్నిక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా తెలుగుదేశం మద్దతుతో జగ్గారెడ్డి, కాంగ్రెసు అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు. ప్రచారానికి గురువారం సాయంత్రం తెర పడింది.
గజ్వెల్ నుంచి శానససభకు ఎన్నికైన కెసిఆర్ రాజీనామా చేయడంతో మెదక్ లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక జరుగుతోంది. సాధారణ ఎన్నికల్లో కెసిఆర్కు దాదాపు 39 వేల మెజారిటీ వచ్చింది. కెసిఆర్ కన్నా కొత్త ప్రభాకర్ రెడ్డికి ఎక్కువ మెజారిటీ సాధించాలనే ఉద్దేశంతో తెరాస నాయకులు పాటు పడ్డారు. తనకన్నా ఎక్కువ మెజారిటీ ఇచ్చి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కెసిఆర్ ప్రజలను కోరారు.
అయితే, ప్రభుత్వాన్ని నడిపించాలంటే తాము విజయం సాధించకపోయినా సరే, మెజారిటీ తగ్గిస్తే సరిపోతుందనే పట్టుదలతో కాంగ్రెసు, బిజెపి నాయకులు పనిచేసినట్లు కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కూడా సాధారణ ఎన్నికల్లో శాసనసభకు మెదక్ జిల్లాలోని నియోజకవర్గాల నుంచే కాంగ్రెసు తరఫున పోటీ చేసి ఓడిపోయారు. జగ్గారెడ్డి చివరి నిమిషంలో బిజెపిలోకి మారి, లోకసభ స్థానం టికెట్ దక్కించుకున్నారు.
కెసిఆర్ను ఏదో మేరకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు, బిజెపి హేమాహేమీలు ప్రచారం సాగించారు. చివరి రోజు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మెదక్ పార్లమెంటు స్థానంలో తమ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేశారు. మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కోసం చివరి రోజు రంగంలోకి దూకారు. ఆయన కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం సాగించారు. తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేతలు డి. శ్రీనివాస్, హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఎడతెరిపి లేకుండా ప్రచారం చేస్తూ తెరాసను ఎండగట్టే ప్రయత్నాలు చేశారు.
బిజెపి తరఫున పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు దత్తాత్రేయ తదితరులు రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు కూడా ప్రచారం సాగించారు. కెసిఆర్ను లక్ష్యం చేసుకుని బిజెపి, కాంగ్రెసు నాయకులు విరుచుకుపడ్డారు. చివరి రోజు సునీతా లక్ష్మారెడ్డి కెసిఆర్పై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. తనను చెల్లని రూపాయి అని అనడంపై కెసిఆర్ మీద ధ్వజమెత్తారు. కెసిఆర్ కూడా గతంలో ఓడిపోయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
కాగా, మెదక్ లోకసభ స్థానంలోని మెజారిటీ శాసనసభ స్థానాలు తెరాస చేతిలో ఉన్నాయి. పైగా ఈ జిల్లా నుంచే కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెదక్ లోకసభ స్థానంలో మంత్రి హరీష్ రావు నిరంతరం ప్రచారం సాగిస్తూ ప్రభాకర్ రెడ్డి కోసం పాటు పడుతూ వచ్చారు. జగ్గారెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడంపై బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నించారు.
ప్రచారానికి తెర పడడానికి ఒక రోజు ముందు కెసిఆర్ కూడా మెదక్ లోకసభ స్థానంలో ప్రభాకర్ రెడ్డి కోసం ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచార సభలో సునీతా లక్ష్మారెడ్డిపై, కాంగ్రెసు నాయకులపైనే కాకుండా బిజెపిపై కూడా విమర్శలు చేశారు. మొత్తం మీద, మెదక్ లోకసభ ఎన్నికల ఫలితం ప్రభావం కెసిఆర్ ప్రభుత్వంపై ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.