ఎస్వీ మోహన్ రెడ్డిపై ఫిర్యాదు, లోకేష్ ఎఫెక్ట్.. సుజనకు ఛాన్స్ ఇచ్చేనా?
విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ నుంచి గెలిపొంది, ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
తక్షణమే ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అందరి పైన వేటు వేయాలని వారు కోరారు. డిప్యూటీ స్పీకర్ను కలిసిన వారిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
సుజనా చౌదరికి బాబు అవకాశమిచ్చేనా?
కేంద్రమంత్రి సుజనా చౌదరికి మళ్లీ రాజ్యసభ టిక్కెట్ దక్కేనా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఈ రోజు రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్రమంత్రిగా ఉన్న సుజన టర్మ్ కూడా ఈసారి పూర్తవుతుంది. దీంతో మరోసారి తనకు అవకాశం వస్తుందని ఆయన భావిస్తున్నారు.
సుజనా పైన గత కొంతకాలంగా సొంత పార్టీకి చెందిన ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం, తీసుకున్న రుణాలను చెల్లించడం లేదని మారిషస్కు చెందిన బ్యాంకు కోర్టులో కేసు వేయడం, ఆ వ్యవహారంలో కోర్టు వారెంట్ జారీ చేయడం వంటి పరిస్థితులు తలెత్తాయి.
అంతేకాదు, మరికొన్ని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్తో సుజనకు గతంలో ఉన్నట్లుగా మంచి సంబంధాలు లేవని కూడా అంటున్నారు. ఇలాంటి పలు కారణాలతో సుజనకు టిక్కెట్ లభించే అవకాశంపై అనుమానాలు తలెత్తుతున్నాయని అంటున్నారు.
కేంద్రంలో సహాయమంత్రిగా ఉన్నప్పటికీ పార్టీ ఎంపీలను పట్టించుకోవడం సొంత పార్టీ ఎంపీలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా చెబుతున్నారు. అయితే, సుజనా చౌదరికి మరోసారి అవకాశం దక్కడం ఖాయమని మరికొందరు అంటున్నారు.