గందరగోళం: 'తాత్కాలిక సచివాలయం' వాయిదా, కేంద్రం మెచ్చుకుందన్న బాబు
విజయవాడ: ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణం పైన డైలమా కొనసాగుతోంది. ఈ రోజు (బుధవారం, 10వ తేదీ) బిడ్లు తెరుస్తామని మంత్రులు ఇటీవల చెప్పారు. తాజాగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. తాత్కాలిక సచివాలయ భవన శంకుస్థాపన వాయిదా పడినట్లు చెప్పారు.
తాత్కాలిక సచివాలయానికి ఈ నెల 12న శంకుస్థాపన చేయడం లేదని మంత్రి పత్తిపాటి తెలిపారు. ఈ నెల 17లోగా టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా శంకుస్థాపన నిర్వహించేలా చూస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 తర్వాత గుంటూరు నుంచే వ్యవసాయ వర్శిటీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎనిమిది నెలల్లో పరిపాలన భవనం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్ వర్శిటీ కోసం రూ.125కోట్లు కేటాయించేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఆచార్య ఎన్జీరంగా వర్శిటీ పాలకవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని, కొత్త ఉపకుపతి నియామక అంశం సీఎం చంద్రబాబు పరిశీలనలో ఉందన్నారు.
కాగా, తాత్కాలిక సచివాలయానికి ఎల్ అండ్ టి, షాపూర్ పల్లోంజీ కంపెనీలు బిడ్లు వేసిన విషయం తెలిసిందే. 10వ తేదీన బిడ్లు తెరుస్తారని, 12న సచివాలయానికి శంకుస్థాపన చేస్తామని ఇటీవల చెప్పారు. అయితే, ప్రభుత్వం ఇచ్చే ధరకు కంపెనీలు ససేమీరా అంటుండటంతో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.
తాత్కాలిక సచివాలయం నిర్మాణం నేపథ్యంలో.. చదరపు అడుగుకు రూ.3వేలు ఇస్తామని ప్రభుత్వం బిడ్లు వేసిన కంపెనీలకు చెప్పిందని తెలుస్తోంది. అయితే, పన్నులతో కలిపి రూ.3,700కు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీలు ససేమీరా అన్నాయని తెలుస్తోంది.
మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాజకుమారి ప్రమాణస్వీకారం
ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నన్నపనేని రాజకుమారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీ రాయపాటి సాంబశివ రావు తదితరులు హాజరయ్యారు.
సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరుపై సమీక్షఇంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో ఉపాధి హామీ అమలును కేంద్రం ప్రశంసించిందని చెప్పారు. హుధుద్ తుఫాను నుంచి కోలుకొని అంతర్జాతీయ వేడుకలకు విశాఖ వేదిక అయిందన్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు.