పదో నెంబర్ హెచ్చరిక: అలల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే
హైదరాబాద్/ విశాఖఫట్నం: హుధుద్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నాసా హెచ్చరించింది. ముందస్తు చర్యలు తీసుకోకుంటే భారీ నష్టం వాటిల్లుతుందని తెలియజేసింది. ఇప్పటికే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఉప్పాడ వద్ద పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లిన పిఠాపురం శాసనసభ్యుడు వర్మకు ప్రమాదం తప్పింది. ఉప్పాడ బీచ్ను పరిశీలించడానికి ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా అలలు ఎగిసి పడ్డాయి. అనుచరులు ఆయనను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారు.
తుఫాను పశ్చివాయువ్యంగా కదులుతూ విశాఖకు ఆగ్నేయంగా 330 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. రేపు(ఆదివారం) మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి ముందుకు దూసుకువస్తోంది.
కాకినాడ, గంగవరం, భీమునిపట్నం, విశాఖపట్నం, కళింగ పట్నం ఓడరేవుల్లో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఐదో నెంబర్ జాతీయ రహదారిని శనివారం సాయంత్రం ఆదివారం ఉదయం వరకు మూసేస్తున్నారు. మిగిలిన చోట్ల రాకపోకల మీద ఆంక్షలు విధించారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలను కోరారు. ఇచ్చాపురం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు హై అలర్ట్ ప్రకటించారు. మలిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక చేశారు. విశాఖపట్నంలోని వుడా పరిధిలోని పార్కులను ముందు జాగ్రత్త చర్యగా మూసేశారు. నాగావళి, వంశధార నదులకు వరద ఉధృతి పెరిగిది. విశాఖలో ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తుఫాను తీవ్రత అంచనాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రో సాయం కోరింది.
నర్సన్నపేటలో ఈదురుగాలులు
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేటలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పొలాకి వద్ద సముద్రతీరంలో అలల ఉధృతి అధికంగా ఉంది. కళింగపట్నం మండలం బందరవానిపేట వద్ద సముద్రం 150 మీటర్ల మేర ముందుకొచ్చింది.
కంట్రోల్ రూం
తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విశాఖపట్నంలో కంట్రోల్ రూం తెరిచారు. అధికారులు, ప్రభుత్వోద్యోగులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం
తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. యువరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తాము తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై వివరించారు.
ప్రత్యేకాధికారి సమీక్ష
విశాఖపట్నం సర్క్యూట్ హౌస్లో అధికారులతో తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రత్యేకాధికారి అరవింద్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఎగిసిపడుతున్న అలలు
విశాఖపట్నం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తీవ్రమైన తుఫాను ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వాధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
అన్నీ సిద్ధం
సహాయక శిబిరాల వద్ద అవసరమైన బియ్యం, పప్పులు, ఔషధాలు, పాలు, స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులో ఉంచుతున్నారు. మూడు పూటల ఆహారం అందించేందుకు శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు.
ప్రతి మండలంలో..
ప్రతి మండల కేంద్రంలో జెసిబి, ప్రొక్లెయిన్, లారీలు ఇతర సాధన సంపత్తిని అందుబాటులో ఉంచుతున్నారు. సంచార నీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప దగ్గర సముద్రం 100 మీటర్ల మేర ముందుకు దూసుకురావడంతో గట్టు కోతకు గురైంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో తీరప్రాంత గ్రామాల్లో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో విజయనగరం, తూగో జిల్లాలో ఈదురు గాలులు అధికమయ్యాయి. సముద్ర తీరంలో అలల ఉధృతి పెరిగింది. తుపాను ప్రభావంతో కాకినాడ సమీపంలో సముద్రం ముందుకు దూసుకువచ్చింది.
పలు రైళ్లు రద్దు
హుద్హుద్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. దాదాపు 35 రైళ్లను రద్దు చేయగా, మరో 31 రైళ్లను దారి మళ్లించారు. శనివారం ప్రయాణించాల్సిన తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్ రద్దు అయింది. సికింద్రాబాద్ -భువనేశ్వర్ దురంతో, గరీబ్ రథ్, తిరుమల ఎక్స్ప్రెస్, విజయవాడ-రాయగడ్ ప్యాసింజర్, మచిలీపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను నాగపూర్, రాయపూర్, ఖరగ్పూర్ మీదుగా దారి మళ్లించారు.
తుపాను నేపథ్యంలో రైల్వేశాఖ ఉన్నతాధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సికింద్రాబాద్, విజయవాడ, తునిలో అత్యవసర కంట్రెల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్ నెంబర్లను ప్రారంభించారు. రైల్వే ట్రాక్ల పర్యవేక్షణకు ఇంజనీరింగ్ స్టాఫ్తో ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నట్లు రైల్వే జీఎం తెలిపారు. రైల్వే బ్రిడ్జ్ల దగ్గర వాటర్ లెవల్స్ పరిశీలించేందుకు సూపర్వైజర్లను, గ్యాంగ్ మెన్లను అందుబాటులో ఉంచుతున్నారు.
విజయవాడ సెక్షన్లో అదనపు డీజిల్ ఇంజిన్ల, జనరేటర్లు, అక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్లను సిద్ధం చేస్తున్నారు. తుపాను కారణంగా ఎక్కడైనా రైళ్లు ఆగిపోతే అందులోని ప్రయాణికుల కోసం ఆహార పదార్ధాలను అందుబాటులో ఉంచుతున్నారు. తుపాను నేపథ్యంలో విశాఖ ప్రాంత రైల్వే ఉద్యోగులకు సెలవురు రద్దు చేశారు.
ఆర్టీసీ అధికారుల సైతం తుపాను పరిస్థితిని అంచనా వేస్తున్నారు. రోడ్ల పరిస్థితిని బట్టి సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అత్యవసరమైతే తప్ప తుపాను తీరం దాటే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను అధికారులు కోరుతున్నారు.
చిన రాజప్ప సమీక్ష
తూర్పు గోదావరి జిల్లాలో తుపాను పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప అక్కడే ఉండి సమీక్షిస్తున్నారు. అధికారులతో కలిసి తీర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాపై తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అధికారులకు సెలవులను రద్దు చేశారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేశారు.
చంద్రబాబు సమీక్ష
విశాఖకు తుపాను ముంచుకొస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయం తుపానుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, విపత్తు నిర్వహణశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కెసిఆర్ సూచన
హుధుద్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రులు, కలెక్టర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించారు. తెలంగాణాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని కావును ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని రెవెన్యూశాఖ కార్యదర్శి బీ.ఆర్.మీనాకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
హెల్ప్లైన్లు
బిఎస్ఎన్ఎల్
0891
-
25707777,
2544269
ఈపిడిసిఎల్
0891
-
2718091