దాచేపల్లి ఇష్యూ.. బాబు రాజీనామా చేయాలి: రోజా బైఠాయింపు, పోలీసులతో వాగ్వాదం
Recommended Video
దాచేపల్లి: బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నిందితుడిని అరెస్టు చేయడానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. రోజా శుక్రవారం ఉదయం దాచేపల్లి అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై వృద్ధుడు రేప్: స్పందించిన జగన్, పవన్ కళ్యాణ్
ఏపీ సీఎం నివసిస్తున్న ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం దారుణం అన్నారు. ఆ అమ్మాయికి ఇప్పుడు మగవాళ్లు అంటేనే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు పరామర్శించడం లేదన్నారు. ఆడపిల్లల మాన, ప్రాణాలకు విలువ లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. పదల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు.
అడవిలో ఉన్నామా, ప్రజల్లో ఉన్నామా?
బాలికపై మృగాడి దాష్టీకం దారుణమని రోజా అన్నారు. మనం అడవిలో ఉన్నామా లేక ప్రజల్లో ఉన్నామా చెప్పాలన్నారు. ఇంత వరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. రాజధాని ప్రాంతంలో ఇలాంటి సంఘటన దారుణం అన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు అప్పుడే చర్యలు తీసుకుంటే
తునిలో ఓ బాలికపై టీడీపీ నేత అత్యాచారయత్నానికి ఒడిగట్టారన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే చర్యలు లేవన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ నేతలపై చర్యలు లేవన్నారు. మహిళా వ్యతిరేక నేరాల్లో అయిదుగురు టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై చంద్రబాబు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. కేసుల్లో ఉన్న నేతలకే చంద్రబాబు పదవులు ఇస్తున్నారన్నారు.
చంద్రబాబు రాజీనామా చేయాలి
ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు ప్రభుత్వానికి బౌన్సర్లుగా పని చేస్తున్నారన్నారు. ఏపీలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదని మండిపడ్డారు. తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అనంతరం రోజా గుంటూరు ఆసుపత్రి ఎదుట ఎమ్మెల్యేలు రోజా, ఆర్కే బైఠాయించారు. ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమమెల్యేలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తోసేసినట్లుగా తెలుస్తోంది.
తొమ్మిదేళ్ల బాలికపై
కాగా, తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడైన ఓ రిక్షా కార్మికుడు అత్యాచారం చేసిన సంఘటన దాచేపల్లిని కుదిపేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది బుధవారం అర్ధరాత్రి దాటాక ఆందోళనకు దిగారు. గురువారం తెల్లవారుజామువరకూ రాస్తారోకో చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ప్రకటించింది.