కోనసీమ ఉద్రిక్తత.. అదృశ్య శక్తులను బయటకు లాగుతాం; డీఐజీ పాలరాజు సీరియస్ వార్నింగ్
కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళనకారులు ఒక్కసారిగా ముట్టడించి తగలబెట్టారు. అలాగే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి చేశారు. ఆందోళనకారుల ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా గాయాలపాలయ్యారు. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దు అంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై హోం మంత్రి తానేటి వనిత సీరియస్ అయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, దీనికి కారణమైన అదృశ్యశక్తులను బయటకు లాగుతాం అంటూ పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమలాపురం లో చోటుచేసుకున్న ఘటన పై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పందించారు.
అమలాపురంలో అదనపు బలగాలను మోహరించామని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కొంతమంది ఆందోళనకారుల దాడిలో గాయపడిన పోలీసులకు ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించారు. ప్రజలు సంయమనం పాటించాలని డిఐజి పాలరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ ఘటనలో దాడికి పాల్పడిన కొందరిని గుర్తించామని చెప్పిన ఆయన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటన వెనక ఏ అదృశ్య శక్తులు ఉన్నాయో అందరినీ బయటకు తీసుకు వస్తామని, దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు వెల్లడించారు. అమలాపురం లో 144 సెక్షన్ అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 144 సెక్షన్ నేపధ్యంలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని వెల్లడించారు. అమలాపురం లో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఉద్రిక్త పరిస్థితులను కట్టడి చేస్తామని ఆయన పేర్కొన్నారు.